సంచైత మరో సంచలనం.. ప్రైవేటు చేతుల్లోకి చారిత్రక విజయనగరం మహారాజా కాలేజ్..
విజయనగరం : పూసపాటి వంశీయుల వారసత్వాన్ని మాన్సాస్ కొత్త ఛైర్ పర్సన్ సంచైత గజపతిరాజు మంటగలుపుతున్నారని ఓవైపు ఆమె బాబాయ్ అశోక్ గజపతిరాజు కోర్టుల్లో న్యాయపోరాటం, టీడీపీ వీధి పోరాటం చేస్తున్న నేపథ్యంలో తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం వెలువడింది. ఇప్పటివరకూ మాన్సాస్కు సంబందించిన చిన్నా చితకా నిర్ణయాల్లోనే సంచైత వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శలు వినిపిస్తుండగా.. ఇఫ్పుడు ఏకంగా పూసపాటి వంశీయులకు చెందిన దశాబ్దాల నాటి మహారాజా కళాశాలను ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించడం పెను సంచలనం రేపుతోంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా వెళ్లాయి.
మహారాజా కళాశాల చరిత్ర...
పూసపాటి రాజవంశీయులు 1879లో విజయనగరంలో మహారాజా ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు డిమాండ్ పెరగడంతో ఇంటర్, డిగ్రీ కోర్సులను కూడా ప్రారంభించారు. దశాబ్దాలుగా ఎందరికో ఉన్నత విద్యాభ్యాసం అందించిన ఈ కళాశాలలో చదువుకున్న వారు ఎందరో ఉన్నత స్ధానాలకు చేరుకున్నారు. విదేశాలకు వెళ్లారు. అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఈ ఉన్నత విద్యాసంస్ధను తర్వాత కేవలం కళాశాలకే పరిమితం చేశారు. స్కూలును మరో ప్రాంగణంలోకి తరలించి ప్రైవేటు పరం చేసేశారు. అప్పటి నుంచి ఇది కాలేజీగానే కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం ఇందులో 26 మంది అన్ ఎయిడెడ్, 100 అన్ ఎయిడెడ్ అధ్యాపకులు ఉన్నారు. 35 మంది బోధనేతర సిబ్బంది కూడా ఉన్నారు. 4 వేల మంది విద్యార్ధులు ఇక్కడ చదువుతున్నారు. యూజీసీ నిధులతోనే ఈ కాలేజీ ఇప్పటికీ నడుస్తోంది.
సంచైత నిర్ణయంతో ప్రైవేటు చేతుల్లోకి..
హైస్కూల్గా మొదలుపెట్టి కాలేజీ అయిన మహారాజా కళాశాలలో హైస్కూల్ ఎప్పుడో ప్రైవేటు పరం అయిపోగా.. ఇప్పుడు కాలేజీని కూడా ప్రైవేటుకు అప్పగించాలని మాన్సాస్ తాజాగా నిర్ణయించింది. నిర్వాహణా భారం పెరుగుతుందన్న కారణంతో మాన్సాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. ఉన్నత విద్యామండలి వీటిని పరిశీలిస్తోంది. ఓసారి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే మహారాజా కాలేజీ కూడా ప్రైవేటు పరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంగా కళాశాలలు ప్రారంభం కాలేదు. దీంతో వచ్చే విద్యా సంవత్సరానికి ముందే దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
Recommended Video
మాన్సాస్లో మరో కలకలం..
ఇప్పటికే ఛైర్పర్సన్గా సంచైత గజపతిరాజు అడుగుపెట్టిన నాటి నుంచి మాన్సాస్ విషయంలో పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని ఆమె బాబాయ్ అశోక్తో పాటు విపక్ష పార్టీలు ఆరోపిస్తుండగా.. తాజాగా మహారాజా కాలేజ్ విషయంలోనూ ఆమె నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు సేవా భావంతో నిర్వహించే ఉద్దేశంతో నిర్మించిన మహారాజా విద్యాసంస్ధను ప్రైవేటుకు అఫ్పగిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించలేమని స్ధానికులు చెబుతున్నారు. అయితే మారుతున్న పరిస్ధితులకు అనుగుణంగా ప్రైవేటీకరణలో తప్పేముందనే వాదన మాన్సాస్ వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.