మాన్సాస్లో లీకుల గోల- సంచైత నిర్ణయాలు బయటికి- ఇక నేరుగా స్పెషల్ కమిషనర్ కే దస్త్రాలు..
విజయనగరంలోని మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్గా అశోక్ గజపతి రాజు ఉండే రోజుల్లో ఆ ట్రస్టు గురించి ఇతర జిల్లాల వారికి అంతగా తెలిసేది కాదు. అంత గుట్టు చప్పుడు లేకుండా వ్యవహారాలు, నిర్ణయాలు సాగిపోయేవి. ట్రస్టు సభ్యుల నియామకం, ప్రైవేటీకరణతో పాటు ఎలాంటి నిర్ణయాన్నీ బయటికి రానిచ్చేవారు కాదు. అశోక్పై ఉన్న గౌరవంతో మీడియా కానీ విపక్షాలు కానీ వాటిని రాజకీయం చేసేవి కావు. కానీ సంచైత రాకతో పరిస్ధితి మారిపోయింది. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న మీడియాతో పాటు విపక్షాలు కూడా సంచైత ప్రతీ నిర్ణయాన్నీ టార్గెట్ చేస్తున్నాయి. మాన్సాస్ ఛైర్పర్సన్ హోదాలో అన్ని నిర్ణయాలు తీసుకునేందుకు ఆమెకు అధికారం ఉన్నా ప్రతీ దాన్నీ వివాదాస్పదంగా మార్చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతీ నిర్ణయం ప్రభుత్వం ఆమోదం వేయించుకునేలోపే లీక్ అవుతోంది.
బాబాయ్ అశోక్గజపతిరాజుపై సంచైత నిప్పులు- అంతా మీరే చేశారు- ఇప్పుడేమీ తెలియనట్లు...
మాన్సాస్లో లీకేజీల గోల...
విజయనగరంలోని పూసపాటి రాజవంశీయుకులకు చెందిన మాన్సాస్ ట్రస్టులో గతేడాది అనూహ్య పరిస్ధితుల్లో ఛైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన సంచైత గజపతిరాజు ప్రతీ నిర్ణయంపై తనదైన ముద్ర వేస్తున్నారు. స్వతహాగా యవ రక్తం కావడంతో నిర్ణయాలు కూడా అంతే వేగంగా ఉంటున్నాయి. వీటిని తెలుసుకుని, చర్చించుకుని, రాజకీయం చేసే లోపు వాటికి ప్రభుత్వం నుంచి ఆమోద ముద్ర కూడా పడిపోతోంది. దీంతో ఆమె ప్రత్యర్దులు కూడా మరింత రాటుదేలారు. మాన్సాస్తో పాటు దేవాదాయశాఖలో తమకున్న పరపతి వాడుకుంటూ ఓ నిర్ణయంపై ప్రతిపాదన రాగానే దాన్ని మీడియాకు లీక్ చేసేస్తున్నారు. దీంతో తాత్కాలికంగా అయినా సరే సంచైత ఇరుకునపడుతోంది. ఆ తర్వాత వాటిపై వివరణలు ఇస్తున్నా ప్రజల్లో మాత్రం అనుమానాలు పెరుగుతున్నాయి.
లీకులతో సంచైతకు ఇబ్బందులు...
మాన్సాస్ ట్రస్టులో ప్రక్షాళన కోసం ప్రయత్నిస్తున్న సంచైత గజపతిరాజు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటిలో కొన్ని వారసత్వ సంప్రదాయాలను సైతం పక్కనబెట్టి తీసుకోక తప్పని పరిస్ధితి. మారుతున్న పరిస్ధితుల్లో ఇవి అత్యవసరం అని సంచైత భావిస్తున్నారు. కాలాగుణంగా ట్రస్టులో మార్పులు జరగలేదని భావిస్తున్న సంచైత.. తన హయాంలో సంస్కరణలకు నాందిపలకాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే లీకుల కారణంగా ట్రస్టు ప్రతిపాదన స్ధాయిలోనే ఉన్న అంశాలు కాస్తా వివాదాస్పదంగా మారిపోతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సంచైత నిర్ణయాలు తీసుకుంటున్నారని, పూసపాటి రాజవంశీయుల ప్రతిష్టను మంటగలుపుతున్నారని స్వయానా ఆమె బాబాయ్ అశోక్ గజపతిరాజే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో సంచైత ప్రత్యర్ధులకు టార్గెట్ అయిపోతున్నారు.
లీకులిస్తున్నారని కమిషనర్లపై అనుమానాలు...
మాన్సాస్ ట్రస్టులో తీసుకున్న పలు నిర్ణయాలను ప్రతిపాదనల రూపంలో ప్రభుత్వానికి పంపుతుంటారు. ప్రస్తుతం ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరుపుతున్న ట్రస్టు కాబట్టి ఎలాగో వాటికి ఆమోద మద్ర లాంఛనమే. కానీ తాజాగా దేవాదాయశాఖలో అదనపు కమిషననర్గా ఉన్న రామచంద్రమోహన్ గతంలో సింహాచలం ట్రస్టు ఈవోగా, మాన్సాస్ ఇన్ఛార్జ్ ఈవోగా పనిచేశారు. తాజాగా ఆయనకు దస్త్రాలు పంపకూడదని మాన్సాస్ నిర్ణయించింది. ఆయన స్ధానంలో సంయుక్త కమిషనర్గా ఉన్న చంద్రశేఖర్ ఆజాద్కు పంపడం మొదలుపెట్టారు. మూడు నెలల్లోనే ఆయనకూ పంపరాదని నిర్ణయించారు. వీరిద్దరి హయంలో మాన్సాస్ తీసుకున్న పలు నిర్ణయాలు లీక్ చేశారనే అనుమానాలున్నాయి. దీంతో వీరిద్దరికీ దస్త్రాలు పంపడం లేదని తెలుస్తోంది.
Recommended Video
ఇకపై స్పెషల్ కమిషనర్కే దస్త్రాలు..
ఇప్పటికే లీకుల భయంతో ఇద్దరు అధికారులకు దస్త్రాలు పంపడమే మానేసిన మాన్సాస్ ట్రస్టు.. తాజాగా స్పెషల్ కమిషనర్కే నేరుగా దస్త్రాలు పంపేలా నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అయితే రాష్ట్రంలో ఏ ఆలయ ట్రస్టుకు లేనట్లుగా కేవలం మాన్సాస్కే వర్తించేలా ఈ ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాన్సాస్ ట్రస్టులో నెలకొన్న ప్రత్యేక పరిస్ధితులు, ట్రస్టుకు ఉన్న గౌరవం ఇలా పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదనపు కమిషనర్, సంయుక్త కమిషనర్ను కాదని నేరుగా స్పెషల్ కమిషనర్కు దస్త్రాలు పంపడం ద్వారా లీకేజీలు అరికట్టవచ్చని మాన్సాస్ ట్రస్టు భావిస్తుండగా.. ఈసారైనా లీకులకు అడ్డుకట్ట పడుతుందా అన్నదానిపై చర్చ జరుగుతోంది.