సేవ్ మన్సాస్ ఉద్యమం గరంగరం: సంచైత ఏమంటున్నారు? అశోక్ గజపతి రాజు కేరీర్ కోసం: అసలు రంగు
విజయనగరం: ఉత్తరాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజు చేపట్టిన సేవ్ మన్సాస్ ట్రస్ట్ ఉద్యమం క్రమంగా వేడెక్కుతోంది. గజపతి రాజు కుటుంబీకుల మధ్య వాడివేడిగా ఆరోపణలు, ప్రత్యారోపణలు నడుస్తున్నాయి... ఈ విషయంలో. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న మన్సాస్ ట్రస్ట్, మహారాజా విద్యాసంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ అశోక్ గజపతి రాజు చేపట్టిన ఉద్యమంపై వాటి ఛైర్పర్సన్ సంచైత గజపతి రాజు ఎదురుదాడికి దిగారు. అది సేవ్ మన్సాస్ ఉద్యమం కాదని.. సేవ్ అశోక్ ఉద్యమం అని అభివర్ణించారు. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్లను సంధించారు.
సేవ్ మన్సాస్ ఉద్యమంపై..
సేవ్ మన్సాస్ పేరుతో అశోక్ గజపతి రాజు సారథ్యంలో ఓ ఉద్యమం విజయనగరం జిల్లాలో ఆరంభమైంది. తెలుగుదేశం, ఆమ్ ఆద్మీ పార్టీ సహా కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి అశోక్ గజపతి రాజు ఈ ఉద్యమాన్ని చేపట్టారు. విజయనగరంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. 50 వేల కోట్ల రూపాయల కోసం మన్సాస్ ట్రస్ట్, మహారాజా విద్యాసంస్థల భూములను తాకట్టు పెట్టడానికి సంచైత గజపతి రాజు ప్రయత్నిస్తున్నారంటూ ఆయా పార్టీల నేతలు విమర్శించారు.
తన నియామకంపై..
దీనిపై సంచైత నిప్పులు చెరిగారు. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమం పేరుతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్గా అశోక్ గజపతి రాజో సోదరుడి కుమార్తెనైన తనను నియమించడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నప్పుడు ఈ ఉద్యమాన్ని ఎందుకు చేపట్టలేకపోయారని నిలదీశారు. ఆ అక్రమాలన్నీ ఎక్కడ బయటికొస్తాయోననే భయంతో ఈ జనం బలం లేని ఈ ఉద్యమాన్ని చేపట్టారని అన్నారు.
ఎనిమిది వేల ఎకరాలు
అశోక్ గజపతి రాజు తన హయాంలో ఎనిమిది వేల ఎకరాల మాన్సాస్ ట్రస్ట్ భూములను ఎకరా 500 రూపాయలకు తన అనుచరులు, అనుయాయులకు లీజుకు కట్టబెట్టారని, అప్పుడు సేవ్ మాన్సాస్ ఉద్యమాన్ని చేయాల్సిందని గుర్తు చేశారు. మార్కెట్ ధరకు ఆయన ఇచ్చిన లీజులకు ఏమైనా సంబంధముందా? అని ప్రశ్నించారు. కనీసం మంచి న్యాయవాదిని కూడా పెట్టుకోకపోవడానికి చేత కాలేదని, 13 కోట్ల నష్టాన్ని కలిగించే మాన్సాస్ భూములు ఎక్స్ పార్టీ డిక్రీ ద్వారా అన్యాక్రాంతమైనప్పుడు సేవ్ మాన్సాస్ ప్రారంభించాల్సిందని ఎదురుదాడి చేశారు.
Recommended Video
అశోక్ హయాంలో అన్నీ అవకతవకలే..
2016- 2020 మధ్యకాలంలో అశోక గజపతి రాజు ప్రభుత్వానికి సరైన సమాచారం ఇవ్వకపోవడంతో మాన్సాస్ విద్యా సంస్థలకు ఆరు కోట్ల రూపాయల నష్టం వచ్చిందని, అప్పుడెందుకు సేవ్ మాన్సాస్ క్యాంపెయిన్ మొదలు పెట్టలేదని ప్రశ్నించారు. అశోక్ గజపతి రాజు ఛైర్మన్గా ఉన్న కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్యామండలి నుంచి అవసరమైన అనుమతులు తెచ్చుకోకపోవడం వల్ల 170 మందికిచ్చిన డిగ్రీలు చెల్లుబాటుకాకుండాపోయాయని, దానికి కారణం ఎవరనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని సంచైతా అన్నారు.
ఆడిటింగ్ ఎందుకు నిర్వహించలేదు..
సరైన ఆడిటింగ్ నిర్వహించక పోవడం, మ్యాన్యువల్ వాటిని పొందుపరచడం వల్ల అనేక తప్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. తప్పుడు తడకలతో ఆడిటింగ్ చేయించినప్పుడు సేవ్ మాన్సాస్ ఉద్యమం ప్రారంభించి ఉండే అసలు రంగు బయటపడి ఉండేదని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాన్సాస్కు రావాల్సిన 30 కోట్ల రూపాయల నిధులను ఎందుకు రాబట్టుకోలేదని సంచైతా ప్రశ్నించారు. అప్పట్లో ఈ ఉద్యమాన్ని చేపట్టి ఉంటే కొంతైనా ప్రయోజనం ఉండేదని చురకలు అంటించారు. ఎంఆర్ కళాశాలపై అశోక్ గజపతి రాజు ఛైర్మన్ గా ఉన్నప్పుడే ఎయిడెడ్ హోదాను తీసేశారని, ఇప్పుడు అదే విధానం కొనసాగుతోందని గుర్తు చేశారు.