రామతీర్థానికి రామలక్ష్మణ విగ్రహాలు: ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం: మూడు రోజుల మహోత్సవం
విజయనగరం: దేశవ్యాప్తంగా కొన్ని రోజుల పాటు రాజకీయ ప్రకంపనలకు కేంద్రబిందువుగా మారిన విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థం.. ఇక యజ్ఞయాగాదులతో కన్నులపండువగా మారబోతోంది. సీతాసమేత శ్రీరామలక్ష్మణ విగ్రహాల పునః ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేవాదాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగబోతోంది. 28వ తేదీన స్వామివారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిస్తారు. సోమవారం తెల్లవారు జాము నుంచి ఈ విగ్రహాలకు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
శతాబ్దాల నాటి చరిత్ర గల రామతీర్థం ఆలయంలోని శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. స్వామివారి విగ్రహం నుంచి తలను వేరు చేసిన దుండగులు.. దాన్ని రామతీర్థం కోనేటిలో పడేశారు. ఈ ఘటన పెను రాజకీయ దుమారానికి దారి తీసింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతల రాజకీయపరమైన దాడులకు కారణమైంది. రాములవారి విగ్రహం నుంచి తలను వేరు చేసిన ఘటన పట్ల దేశవ్యాప్తంగా హిందూ ధార్మిక సంఘాలు స్పందించాయి.
ధ్వంసమైన రాములవారి విగ్రహం స్థానంలో కొత్త మూర్తులను రూపొందించే బాధ్యతను ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించింది. తిరుపతి అలిపిరి సమీపంలోని శ్రీవేంకటేశ్వర శిల్పకళాశాలలో కొత్త విగ్రహాలను టీటీడీ అధికారులు తయారు చేయించారు. ఈ విగ్రహాలు శనివారం సాయంత్రం రామతీర్థానికి చేరుకున్నాయి. ప్రస్తుతం బాలాలయంలో భద్రపరిచారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు అక్కడే స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. యజ్ఞయాగాదులను నిర్వహిస్తారు. దీనికోసం పలువురు అర్చకులను దేవాదాయ శాఖ అధికారులు రామతీర్థానికి పిలిపించనున్నారు.
రామతీర్థం క్షేత్రాన్ని అభివృద్ధి పనులకు కూడా అదేరోజు శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. రామతీర్థాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలను వ్యయం చేయనుంది. 700 అడుగు ఎత్తులో ఉన్న ఆలయ నిర్మాణం పూర్తి రాతి కట్టడాలతో చేపడతారు. దేవాలయ పరిసరాల ప్రాంతం మొత్తం విద్యుద్దీపాల సౌకర్యాన్ని కల్పిస్తారు. శాశ్వత నీటి వసతి, ప్రహరీ గోడ నిర్మాణం, హోమశాలను నిర్మిస్తామని ప్రభుత్వం ఇదివరకే వెల్లడించింది. పునఃప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు హాజరుకానున్నారు.