ఒక వ్యక్తిని హత్యచేసిన హంతకుడు..అదే వ్యక్తి దూరమయ్యాడంటూ కన్నీరు కార్చడం వింతే: సంచైత
విజయనగరం: తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్కు నివాళి అర్పించారు. ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజు ఎన్టీ రామారావుకు నివాళి అర్పించడాన్ని మన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచైత గజపతి రాజు తప్పు పట్టారు. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబు, అశోక్ గజపతి రాజు కారణమని ఆరోపించారు.
ధర్మకర్తగా అశోక్ గజపతిరాజుకు తెలియకుండా ఉంటుందా?: భువనేశ్వరి, బ్రాహ్మణిలను అడగండి: సంచైత
తెలుగు వారి కీర్తిని ఎలుగెత్తి చాటిన ఆంధ్రుల ఆరాధ్య దైవం,నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నానని అశోక్ గజపతి రాజు చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ పురోభివృద్ధికి పాటుపడాలని ఆయన సూచిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు సంచైత ఘాటుగా బదులు ఇచ్చారు. ఎన్టీ రామారావు మరణానికి కారణమైన వారిలో చంద్రబాబు, అశోక్ గజపతి రాజు ఉన్నారని అన్నారు.
పార్టీపెట్టుకుని సొంతకాళ్లమీద అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ను పదవినుంచి తప్పించి ఆయన మరణానికి కారణమైన వారిలో చంద్రబాబు, అశోక్ గజపతి రాజు ఉన్నారని విమర్శించారు. వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరించాలని ఎన్టీఆర్ అప్పట్లో డిమాండ్ చేశారంటూ సంచైత ఓ లేఖను తన ట్వీట్కు జత చేశారు. అప్పటి కుట్రలో ఎవరెవరు ఉన్నారనడానికి ఈ లేఖ సాక్ష్యమని చెప్పారు.
చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతి రాజు, కోటగిరి విద్యాధర రావు, టీ దేవేందర్ గౌడ్, ఎలిమినేటి మాధవ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ ఎన్టీ రామారావు 1995 ఆగస్టు 25వ తేదీన అప్పటి అసెంబ్లీ స్పీకర్కు రాసిన లేఖ అది. రాజకీయ సూత్రాలు, నైతిక విలువలు, ప్రజలు ఇచ్చిన తీర్పును మంటగలిపిన అశోక్ గజపతి రాజు.. ఇప్పుడు ఎన్టీఆర్ ఆరాధ్యదైవం అంటూ ఆయన వర్థంతిరోజున కొనియాడుతున్నారని, దీన్ని చూస్తోంటే. ఒక వ్యక్తిని హత్యచేసిన హంతకుడు, అదే వ్యక్తి దూరమయ్యాడంటూ కన్నీరు కార్చినట్టుగా ఉందని ధ్వజమెత్తారు.