రామతీర్థం చుట్టూ మరో వివాదం: జగన్ సర్కార్పై విమర్శలకు టీడీపీ మళ్లీ అవకాశం దొరికినట్టే
విజయనగరం: కొద్దిరోజులుగా రాష్ట్ర రాజకీయాలకు హాట్స్పాట్గా మారిన విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థం.. తాజాగా మరో వివాదానికి కేంద్రబిందువైంది. జగన్ సర్కార్పై రాజకీయ విమర్శలను సంధించడానికి తెలుగుదేశం పార్టీకి అవకాశం కల్పించినట్టయింది. తాజా వివాదాన్ని ఆధారంగా చేసుకుని టీడీపీ నేతలు జగన్ సర్కార్పై ఎదురుదాడికి దిగుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అహంకార ధోరణికి అద్దం పడుతోందని మండిపడుతున్నారు.
ఫోటోలు: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం
అశోక్ గజపతి రాజు విరాళం..
ఈ వివాదానికి ప్రధాన కారణం- ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజు విరాళాన్ని రామతీర్థం ఆలయ అధికారులు వెనక్కి తిప్పి పంపడమే. రామతీర్థం మూల విరాట్టు శ్రీరామచంద్రమూర్తి విగ్రహం విధ్వంసానికి గురైన అనంతరం ప్రభుత్వం పునర్నిర్మస్తోంది. విగ్రహం తయారీ బాధ్యతలను తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంది. సొంత నిధులతో టీటీడీ అధికారులు రాములవారి విగ్రహాన్ని తయారు చేస్తోన్నారు. తిరుపతిలో టీటీడీకి చెందిన శిల్ప కళాశాలలో విగ్రహం రూపుదిద్దుకుంటోంది.
వెనక్కి పంపడానికి కారణం..
ఈ విగ్రహం రూపకల్పన కోసం అశోక్ గజపతి రాజు 1,01,116 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఈ మొత్తంతో కూడిన చెక్కును ఆయన ఈ నెల 10వ తేదీన రామతీర్థం ఆలయ కార్యనిర్వహణాధికారి పేరు మీద పంపించారు. విగ్రహం నిర్మాణానికి తాను ఈ మొత్తాన్ని విరాళంగా అందజేస్తున్నట్లు ఓ లేఖను దానికి జత చేశారు. తాజాగా ఈ చెక్ వెనక్కి వచ్చింది. ఆలయ ఈఓ ఈ చెక్కును అశోక్ గజపతిరాజుకు తిప్పి పంపించారు. విరాళాన్ని స్వీకరించట్లేదని తెలిపారు. దీనికి గల కారణాలను ఆయన వివరిస్తూ ఓ లేఖను రాశారు.
మళ్లీ అవమానించేలా
రామతీర్థం ఆలయంలో పునఃప్రతిష్ఠింపజేయడానికి ఉద్దేశించిన శ్రీసీతారామ లక్ష్మణ స్వాముల విగ్రహాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తన సొంత ఖర్చులతో తయారు చేస్తోందని, అందుకే దాతలెవరి నుంచి కూడా విరాళాలను స్వీకరించట్లేదని తెలిపారు. దీనిపట్ల అశోక్ గజపతి రాజు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామతీర్థం దేవస్థానానికి అనువంశిక ఛైర్మన్గా ఉంటూ వస్తోన్న తనను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించారని, ఇప్పుడు మళ్లీ తనను అవమానించేలా విరాళాన్ని తిప్పి పంపించారని విమర్శిస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన పలువురు టీడీపీ నేతలు అశోక్కు అండగా ఉంటున్నారు.
ఉత్తరాంధ్ర టీడీపీ నేతల మండిపాటు
అశోక్ గజపతి రాజు కుటుంబాన్ని ఉద్దేశపూరకంగా కక్షసాధింపు చర్యలకు దిగుతోందని విమర్శించారు. ఇదివరకు సింహాచలం దేవస్థానం, దానితోపాటు మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ హోదా నుంచి తొలగించిన జగన్ సర్కార్.. రామతీర్థం ఛైర్మన్ పదవి నుంచి రాజకీయ కారణాలతో ఆయనను తొలగించిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆయన పంపించిన విరాళాన్ని తిప్పి పంపడం కూడా రాజకీయ దురుద్దేశమే కారణమని అంటున్నారు. ఒక పథకం ప్రకారం.. ప్రభుత్వం అశోక్ గజపతి రాజు కుటుంబంపై దాడి చేస్తోందని, దాన్ని తాము అడ్డుకుంటామని చెబుతున్నారు.