రామతీర్థం ఉదంతంలో సీఐడీ దర్యాప్తు ముమ్మరం: అదుపులో ఇద్దరు అనమానితులు?
విజయనగరం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామచంద్రుల వారి విగ్రహం విధ్వంసం ఘటనలో సీఐడీ అధికారులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. రాజకీయ దుమారానికి దారి తీసిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సీఐడీ విచారణను చేపట్టిన రెండు రోజుల్లోనే అధికారులు పురోగతి సాధించారు. శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Recommended Video
సాక్ష్యాధారాలను సేకరించిన తరువాత.. ఈ విషయాన్ని వెల్లడిస్తారని సమాచారం. రామతీర్థం క్షేత్రంలో శ్రీరామచంద్రుడి విగ్రహం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తలను వేరు చేయడం, దాన్ని దేవస్థానం కోనేటిలో పడేసిన విషయం తెలిసిందే. రాములవారి విగ్రహం తల భాగాన్ని కోనేటి నుంచి వెలికి తీశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రాజకీయ దుమారానికి దారి తీసింది. రాజకీయాలకు హాట్స్పాట్గా మారింది.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం నేతలు వరుస బెట్టి రామతీర్థం క్షేత్రాన్ని సందర్శించారు. భారతీయ జనతా పార్టీ, జనసేన నేతల సందర్శనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై జగన్ సర్కార్ సీఐడీ విచారణకు ఆదేశించగా.. అధికారులు రెండు రోజుల్లోనే కేసును ఛేదించే దిశగా పురోగతిని సాధించారు. విగ్రహం నుంచి తల భాగాన్ని వేరు చేయడానికి రంపాన్ని వినియోగించినట్లు ఇదివరకే నిర్ధారించారు. ఆ దుర్మార్గానికి పాల్పడిన నిందితుల కోసం వేట సాగించారు.
ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి పేర్లు, ఇతర వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాన్ని కూడా రంపంతోనే కోసినట్లు తేలిన విషయం తెలిసింది. ఈ రెండు ఉదంతాల్లో నిందితులు ఒకేరకంగా విధ్వంసానికి పాల్పడటం వల్ల ఈ రెండు ఘటనలకు వారే కారణమై ఉంటారని అనుమానిస్తున్నారు.