రామతీర్థం..మాటల యుద్ధం: చంద్రబాబు..నారా లోకేష్పై ఘాటు పదాలతో ఏకిపారేసిన మంత్రి బొత్స
విజయనగరం: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై విజయనగరం జిల్లాకు చెందిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటు పదాలతో విరుచుకుపడ్డారు. నారా లోకేష్ ఓ లోఫర్ అని విమర్శించారు. ఆయన మీద తనకు ఉన్న కొద్దో, గొప్పో గౌరవం పోయిందని అన్నారు. చంద్రబాబు ఓ సోమరిపోతును కన్నారని ధ్వజమెత్తారు. నారా లోకేష్ ఎందుకూ పనికి రాడని మండిపడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తోన్న వ్యక్తిని నోటికి వచ్చినన్ని మాటలు మాట్లాడిన నారా లోకేష్కు కనీసం సంస్కారం అనే పదానికి కూడా అర్థం తెలియదని భగ్గుమన్నారు.
రామతీర్థం సందర్శించిన మంత్రులు..
కొద్దిసేపటి కిందట ఆయన జిల్లాలోని రామతీర్థం క్షేత్రాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి సందర్శించారు. అక్కడి పరిస్థితులు గురించి ఆరా తీశారు. అర్చకులతో మాట్లాడారు. రాములవారి విగ్రహం తల లభించిన కోనేటిని పరిశీలించారు.. శ్రీరామచంద్రమూర్తి విగ్రహం ధ్వంసం చేయడానికి దారి తీసిన పరిస్థితులు, అక్కడి భధ్రతా ఏర్పాట్ల గురించి చర్చించారు. రామతీర్థం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి, రాములవారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠింపజేయడానికి తక్షణ చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఇష్టానుసారంగా మాట్లాడటమేనా వాక్ స్వాతంత్య్రం అంటే
ముఖ్యమంత్రి స్థాయిని వ్యక్తిని విమర్శించే హక్కు నారా లోకేష్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్య్రం పేరుతో ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నోటికి వచ్చినన్ని మాటలు మాట్లాడటమేనా వాక్ స్వాతంత్య్రం అంటే అని నిలదీశారు. నారా లోకేష్ వంటి లోఫర్లు ఉండబట్టే ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయిందని అన్నారు. ప్రజల ద్వారా ఎన్నుకున్న ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పట్ల నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు దారుణమని చెప్పారు. ఆయన ఎందుకూ పనికిరాడని ఎద్దేవా చేశారు.
ఓర్వేలేకపోతోన్న చంద్రబాబు..
రాష్ట్ర ప్రజలు తమకు ఏకపక్షంగా అధికారాన్ని ఇచ్చారని, ప్రజా తీర్పునకు లోబడి, ప్రజాస్వామ్య బద్ధంగా తాము పరిపాలన సాగిస్తున్నామని అన్నారు. శాంతిభద్రతలను కాపాడుకుంటూ వస్తున్నామని చెప్పారు. ఒకవంక మతసామరస్యాన్ని కాపాడుకుంటూ.. మరోవంక ప్రజలకు అవసరమైన అవసరాలను తీరుస్తూ.. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని బొత్స అన్నారు.
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు, నారా లోకేష్, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ పరిపాలన చూసి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో అలజడులను సృష్టించే కుట్ర..
చంద్రబాబులాంటి మోసగాళ్లు, వెన్నుపోటుదారులు ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి కుట్ర పన్నారని విమర్శించారు. అందుకే దేవతా మూర్తుల విగ్రహాలపై దాడి చేయడమనే ఆకృత్యాలకు పూనుకుంటున్నారని ధ్వజమెత్తారు. మతకల్లోలాలు సృష్టించే ప్రయత్నానికి చంద్రబాబు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారం పోయిందనే ఉక్రోశంతో చంద్రబాబు ఎంతటి నీచానికైనా తెగిస్తారని, పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు. రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.