సంచైతకు జగన్ ప్రమోషన్- మరో 9 దేవాలయాలకు ట్రస్టీగా- అశోక్కు భారీ ఝలక్...
బీజేపీ నేత, పూసపాటి అనందగజపతిరాజు వారసురాలు సంచైత గజపతిరాజుకు జగన్ సర్కారు దీపావళి సందర్భంగా మరో కానుక ఇచ్చింది. ఇప్పటికే విజయనగరం జిల్లాలోని పూసపాటి వంశానికి చెందిన మాన్సాస్ ట్రస్టుతో పాటు సింహాచలం దేవాలయ పాలకమండళ్ల ఛైర్పర్సన్గా బాధ్యతలు అప్పగించిన జగన్ ప్రభుత్వం తాజాగా మరో 9 ఆలయాల బాధ్యతలను ఆమెకు కట్టబెడుతూ సంచలన ఆదేశాలు ఇచ్చింది.
దీపావళి సందర్భంగా మాన్సాస్, సింహాచలం బోర్డుల ఛైర్పర్సన్ సంచైత గజపతిరాజుకు సీఎం జగన్ ప్రమోషన్ ఇచ్చారు. గతంలో అప్పగించిన బాధ్యతలతో పాటు తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని 9 దేవాలయాలకు వ్యవస్ధాపక ట్రస్టు సభ్యురాలిగా సంచైతను గుర్తిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సంచైతను ప్రభుత్వం పూసపాటి వంశ వారసురాలిగా గుర్తించినందున తూర్పుగోదావరి జిల్లాలోని 9 ఆలయాల పాలక మండళ్లకు వ్యవస్ధాపక సభ్యురాలిగా గుర్తిస్తున్నట్లు దేవాదాయశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
దేవాదాయశాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి గ్రామం గంగవరంలోని ముత్యాలమ్మ ఆలయం, కోటిపల్లిలోని గణపతి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, ఐనవిల్లంకలోని సీతారామాంజనేయస్వామి ఆలయం, వీరవల్లిపాలెంలోని రంగనాయక స్వామి ఆలయం, వీరేశ్వర స్వామి ఆలయం, ఐనవిల్లి మండలం చింతల్లంక గ్రామంలోని వనమాలమ్మవారి గుడి, వీరవల్లిపాలెంలోని వనమాళ్లమ్మ గుడి, చింతల్లంకలోని వెంకటేశ్వరస్వామి ఆలయం ఉన్నాయి. ఈ ఉత్తర్వులు నవంబర్ 2నే విడుదలైనప్పటికీ గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.
జగన్ సర్కారు తాజా నిర్ణయంతో ఇప్పటికే మాన్సాస్, సింహాచలం ట్రస్టు బోర్డుల ఛైర్పర్సన్గా సంచైత నియమానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్న ఆమె బాబాయ్ అశోక్ గజపతిరాజుకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. జగన్ సర్కారు ఈసారి సంచైతను ఏకంగా పూసపాటి వంశ వారసురాలిగా గుర్తిస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వడంతో ఇకపై పూసపాటి వంశం ట్రస్టీలుగా ఉన్న పలు ఆలయాలకు సంచైతను ఛైర్పర్సన్గా నియమించేందుకు కూడా అవకాశం దక్కింది.