టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మృతి: గుండెపోటుతో: ఉత్తరాంధ్రలో
కురుపాం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ థాట్రాజ్ కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున మరణించారు. ఆయన వయస్సు 56 సంవత్సరాలు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహించారు. రవాణా శాఖ మాజీమంత్రి శతృచర్ల విజయ రామరాజుకు ఆయన మేనల్లుడు.
మధ్య ప్రదేశ్ గవర్నర్ కన్నుమూత: తీవ్ర అనారోగ్యం: వెంటిలేటర్పై ఉంటూ: ఆరోగ్యం విషమించడంతో
జనార్ధన్ థాట్రాజ్.. చాలాకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కురుపాం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఘన విజయం సాధించారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో ఆయన కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. తన మేనమామ శతృచర్ల విజయరామరాజుతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో కురుపాం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పుష్పా శ్రీవాణి చేతిలో ఓడిపోయారు.
2019లో ఎన్నికల్లో అనూహ్య పరిస్థితుల వల్ల ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటికీ.. అది చెల్లలేదు. కుల ధ్రువీకరణ పత్రానికి సంబంధించి అభ్యంతరాలు రావడంతో.. ఆయన నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. కురుపాం ఎస్టీ రిజర్వుడ్ స్థానం కావడం, థాట్రాజ్ ఎస్టీ కాదంటూ వివాదం చెలరేగడం, దాన్ని ఎన్నికల అధికారులు ధృవీకరించడంతో తప్పుకోవాల్సి వచ్చింది. టీడీపీ తరఫున జనార్దన్ థాట్రాజ్ తల్లి ప్రియా థాట్రాజ్ నామినేషన్ వేశారు. .
Recommended Video
ఎన్నికల బరి నుంచి తప్పుకొన్న తరువాత జనార్ధన్ థాట్రాజ్.. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. టీడీపీకి అంటీముట్టనట్టు వ్యవహరించారు. కొద్దిరోజుల కిందట ఆయన అనారోగ్యానికి గురి అయ్యారు. విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటోన్న ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను విశాఖపట్నం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.