ప్రజా వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత: జననాట్య మండలి వ్యవస్థాపకుడిగా..
పార్వతీపురం: రాష్ట్రానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 78 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అదే సమయంలో గుండెపోటుకు గురయ్యారు. ఈ తెల్లవారు జామున ఆయన కన్నుమూశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. వంగపండు మృతి పట్ల ప్రజా యుద్ధనౌక గద్దర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
కరోనాతో సీపీఎం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత: కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ
1943లో విజయనగరం జిల్లా పెదబొండపల్లిలో ఆయన జన్మించారు. వందలాది జానద పాటలను రచించారు. ఏం పిల్లో ఎళ్దమొస్తవా.. అనే పాట రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి పాడారు. ప్రజా గాయకుడిగా పేరుపొందారు. తన వాగ్గేయాలతో ఏజెన్సీ ప్రాంతాలను చైతన్య పరిచారు. విప్లవకవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. విప్లవ సినిమాల నటుడిగా పేరు తెచ్చుకున్న ఆర్ నారాయణ మూర్తి తీసిన అర్థరాత్రి స్వతంత్య్రంతో సినిమాలో నటించారు.
జననాట్య మండలిని స్థాపించింది ఆయనే. 1972లో జననాట్య మండలిని నెలకొల్పారు. దీనిద్వారా గ్రామీణ స్థాయి కళాకారులను ప్రోత్సహించారు. విప్లవ గీతాలను వినిపించారు. మూడు దశాబ్దాల కాలంలో 300లకు పైగా పాటలను రాశారు. వాటిల్లో చాలా పాటలు జానపదాలే. జానపదాలను విప్లవ సాహిత్యాన్ని మేళవించి పాటలను రాసేవారు. వంగపండు రాసిన కొన్ని పాటలు పలు భాషల్లో అనువదించారు. బెంగాలీలు వంగపండు సాహిత్యాన్ని ఇష్టపడతారు.
Recommended Video
వంగపండు ప్రసాదరావు మృతిపట్ల గద్దర్ దిగ్భ్రాంతిని తెలిపారు. జన గళం మూగబోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వంగపండు జనం గుండె చప్పుడుగా అభివర్ణించారు. అక్షరం ఉన్నంత వరకు వంగపండు జీవించే ఉంటారని అన్నారు. పాటలతో ప్రజలను ఎలా చైతన్యపరవచ్చనడానికి వంగపండు ఓ నిదర్శనమని చెప్పారు. దేశవ్యాప్తంగా 10 భాషల్లో వంగపండు పాటలు, సాహిత్యాన్ని అనువదించారని గద్దర్ చెప్పారు. వ్యక్తిగతంగా తనకు ఆయన లోటు ఎప్పటికీ తీరేది కాదని గద్దర్ అన్నారు.