రంగంలో జనసేన: రామతీర్థంలో ఉద్రిక్తత: రోడ్లన్నీ క్లోజ్..అడ్డుగా బ్యారికేడ్లు: బందోబస్తు
విజయనగరం: రాష్ట్ర రాజకీయాలకు హాట్స్పాట్గా మారిన విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థం.. మళ్లీ ఉద్రిక్తంగా మారింది. జనసేన-భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన రామతీర్థం ధర్మయాత్ర ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రామతీర్థం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేసింది. రామతీర్థానికి దారి తీసే మార్గాలన్నింటినీ మూసివేసింది. రోడ్లకు అడ్డుగా బ్యారికేడ్లను ఏర్పాటు చేసింది. ఈ తెల్లవారుజాము నుంచి రామతీర్థం కొండపైకి వెళ్లడానికి ఎవరినీ అనుమతించట్లేదు.
Recommended Video
రామతీర్థం ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. శ్రీరాముడి విగ్రహం నుంచి తలను వేరు చేశారు. దాన్ని కొలనులో పడేశారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత.. రాజకీయ వేడి హైపిచ్కు చేరుకుంది. తొలుత భారతీయ జనతా పార్టీ.. అనంతరం తెలుగుదేశం నేతలు ఈ ఆలయాన్ని సందర్శించారు. వైఎస్సార్సీపీ నేతలు సైతం రామతీర్థం ఆలయాన్ని సందర్శంచారు. దానికి కొనసాగింపుగా జనసేన నేతలు ఈ ధర్మయాత్రను నిర్వహించడానికి సన్నాహాలు పూర్తి చేశారు.
కొద్దిరోజులుగా రామతీర్ధంలో నిరసనలు వ్య క్తం చేస్తున్న బీజేపీతో కలిసి జనసేన ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఉదయం 11 గంటలకు ఈ ధర్మయాత్ర రామతీర్థానికి చేరుకోవాల్సి ఉంది. దీనితో రామతీర్థంలో మరోసారి ఉత్కంఠ పరిస్ధితులు నెలకొన్నాయి. ఈ యాత్రను భగ్నం చేయడంలో భాగంగా బీజేపీ, జనసేన నేతలను పోలీసులు గృహనిర్బంధంలోకి తీసుకుంటున్నారు. హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ రెండు పార్టీల నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు.
ఈ యాత్రకు బీజేపీ, జనసేన అనుబంధ సంఘాలతో పాటు కొన్ని ధార్మిక సంస్థలు మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటోన్న విగ్రహాల విధ్వంసాన్ని అడ్డుకోవడం, నిందితులపై కఠిన చర్యలను తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందంటూ జనసేన-బీజేపీ నేతలు ఇప్పటికే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని తీసుకొచ్చేలా ఈ ధర్మయాత్రను నిర్వహించనున్నారు. ఈ పరిస్థితుల మధ్య రామతీర్థంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.