జిల్లా పాఠశాలల్లో కరోనా కలకలం: 29 మంది విద్యార్థులకు సోకిన కరోనా
విజయనగరం: కరోనా లాక్డౌన్ అనంతరం గొత కొద్ది రోజుల క్రితమే పాఠశాలలు పునర్ ప్రారంభమయ్యాయి. అయితే, కరోనా విజృంభణ ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులు మాత్రం పాఠశాలలకు రావడం లేదు. కాగా, విజయనగరంలోని రెండు పాఠశాలలో సుమారు 29మందికిపైగా విద్యార్థులకు కరోనా రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
తెరచుకున్న పాఠశాలలు
విజయనగరం జిల్లా గంట్యాడలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 20 విద్యార్థులకు కరోనా పాటిజివ్గా నిర్ధారణ కావడం గమనార్హం. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 9, 10వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
20 మందికి కరోనా
గంట్యాడ పీహెచ్సీ వైద్యులు సెప్టెంబర్ 30న విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 20 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందన్నారు. అయితే, ఉపాధ్యాయుల్లో ఎవరికీ కరోనా సోకలేదని తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం స్పందించారు. ఈ విషయంపై విజయనగరం జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు.
విద్యార్థుల తల్లిదండ్రులకూ కరోనా పరీక్షలు
కరోనా సోకిన 20 మంది విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యల తీసుకోవాలని ఆదేశించినట్లు మంత్రి నాని చెప్పారు. జిల్లా పరిషత్ స్కూల్లో మొత్తం 108 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, 20 మందికి కరోనా సోకినట్లు తెలిపారు. ఈ క్రమంలో కరోనా సోకిన విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
Recommended Video
మరో పాఠశాలలో 9 మందికి..
కరోనా సోకినప్పటికీ లక్షణాలు లేని విద్యార్థులను హోంక్వారంటైన్లో ఉంచాలని సూచించారు. వారికి సీఎం ఆదేశాల మేరకు ప్రత్యేక మెడికల్ కిట్స్ అందజేయాలని జిల్లా అధికారులకు సూచించినట్లు తెలిపారు. కాగా, ఇకపై పాఠశాలలు తెరవాలనుకుంటే డీఎంహెచ్ఓ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ హరిజవహర్ లాల్..డీఈవోను ఆదేశించారు. దత్తిరాజేరు మండలం దత్తి జడ్పీహెచ్ఎస్లో తొమ్మిది మంది విద్యార్థులకు పాజిటివ్ అని తేలింది. అయితే, కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్లేనే కరోనా వ్యాప్తి జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.