వరంగల్లో దారుణం... 14 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం... బాధితురాలి మృతి...
వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం జరిగింది. దుగ్గొండి మండలం రేపల్లెకి చెందిన 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గతనెల 26న జరిగిన ఈ దారుణ ఘటన మృతురాలి తల్లి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి తల్లి ఫిర్యాదు ప్రకారం... బాలికను బెదిరింపులతో లొంగదీసుకుని కొంతకాలంగా ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో.. గర్భం పోగొట్టేందుకు ఆమెతో బలవంతంగా మాత్రలు మింగించారు. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావం జరిగింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన ఆ బాలిక చికిత్స పొందుతూ డిసెంబర్ 26న మృతి చెందింది.
బాధితురాలి తల్లి ఫిర్యాదుతో బాలిక మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా తనపై అత్యాచారం జరుగుతున్నా బాలిక తల్లిదండ్రులతో ఎందుకు చెప్పలేదు... బాలికను వారు ప్రలోభాలు,బెదిరింపులకు గురిచేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Recommended Video
గతేడాది వరంగల్ జిల్లా హన్మకొండలో 9 నెలల చిన్నారిపై పవన్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ కేసులో నిందితుడికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఆ తర్వాత నిందితుడు హైకోర్టులో అప్పీల్ చేసుకోవడంతో యావజ్జీవ శిక్ష ఖరారైంది. గతేడాది నవంబర్ 28న రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ టోల్ ప్లాజా సమీపంలో దిశా హత్యాచార ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇలా అత్యాచార నిందితులకు ఎంత కఠిన శిక్షలు పడుతున్నా కామాంధుల్లో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.