విషాదం: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిపై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య
వరంగల్/హైదరాబాద్: వరంగల్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎంజీఎం ఆస్పత్రి భవనం పైనుంచి దూకి కరోనా బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలానికి చెందిన ఓ ఆటో డ్రైవర్.. కరోనావైరస్ లక్షణాలతో జులై 24న ఆస్పత్రిలో చేరాడు.
మరుసటి రోజు కరోనా నిర్ధారణ కావడంతో అప్పట్నుంచి ఎంజీఎం ఆస్పత్రిలోనే చికత్స పొందుతున్నాడు. అయితే, వైరస్ బారినపడి మనస్తాపానికి గురైన బాధితుడు శుక్రవారం ఎంజీఎం ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఎంజీఎం మార్చురీకి తరలించారు. కాగా, లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయడంతో కరోనా కేసులు రాష్ట్రంలో స్వల్పంగా పెరుగుతున్నాయి.
ఇది ఇలావుండగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. తెలంగాణ రాష్ట్రంలో 2 కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. ఏపీలోనూ రెండు కేసులు నమోదయ్యాయి. జులై 23 వరకు దేశ వ్యాప్తంగా ఈ రకం కేసులు 70 వెలుగు చూసినట్లు తెలిపింది.
13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 28 జినోమిక్ సీక్వెన్సింగ్ ల్యాబ్ల్లో చేసిన పరిశోధనల్లో ఈ కేసులను గుర్తించినట్లు కేంద్ర శాస్త్రసాంకేతికశాఖ మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో శుక్రవారం వెల్లడించారు. ఈ డెల్టా ప్లస్ రకం కేసులు మహారాష్ట్రలో 23 కేసులు వెలుగుచూడగా, మధ్యప్రదేశ్లో 11, తమిళనాడులో 10, ఛండీగఢ్లో 4, కేరళ, కర్ణాకటలో మూడు చొప్పున, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రెండేసి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్, హర్యానా, జమ్మూ, రాజస్థాన్, ఒడిశా, హిమాచల్ప్రదేశ్ లలో ఒక్కో కేసు నమోదైనట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.