నా చావుకు ఆ ఎమ్మెల్యేనే కారణం: గొంతు కోసుకున్న వ్యక్తి, పరిస్థితి విషమం
వరంగల్: ఓ వ్యక్తి గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన హన్మకొండలో చోటుచేసుకుంది. అంతేగాక, అతను తన చావుకు స్థానిక ఎమ్మెల్యేనే కారణమంటూ లేఖ రాయడం గమనార్హం. స్థానిక అదాలత్ వద్ద అమరవీరుల స్తూపం ముందు ఈ ఘటన చోటు చేసుకుంది.
చాకుతో గొంతుకోసుకుని అక్కడే పడిపోయాడు. రక్తపుమడుగులో ఉన్న అతడ్ని స్థానికులు గమనించి.. వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతనికి వైద్యం అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.
ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని వరంగల్ అర్బన్ జిల్లా అలంకానిపేటకు చెందిన మాసం వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు అతని బ్యాగును పరిశీలించగా ఓ సూసైడ్ నోట్ లభించింది. తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి కారణమని వెంకటేశ్వర్లు అందులో పేర్కొన్నాడు.
వచ్చే ఎన్నికల్లో సుదర్న్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని సీఎం కేసీఆర్కు అతడు తన లేఖలో కోరాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు.