తల్లిదండ్రులను సజీవ దహనం చేసిన తనయుడు .. అమానవీయ ఘటన
కొడుకు కాదు అతను కసాయి.. నవమాసాలు మోసి, కని పెంచి పెద్ద చేసిన కన్న తల్లిదండ్రులనే అత్యంత కిరాతకంగా కడతేర్చిన కసాయి.సమాజంలో రోజురోజుకు మానవ సంబంధాలకు అర్థం లేకుండా పోతుంది అని చెప్పటానికి ఓ కొడుకు పేరుతో ఉన్న మానవ మృగం చేసిన దారుణమే ఓ ఉదాహరణ. పేగు తెంచుకుని పుట్టిన కొడుకే కన్న తల్లిదండ్రుల పాలిట కాల యముడుగా మారిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి శివారు గేటు తండాలో చోటుచేసుకుంది.
సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటనలో ఒక కుమారుడు ఆస్తి కోసం చేసిన దారుణం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ఇటీవల తన ప్రేమ వ్యవహారాలకు అడ్డుగా ఉంటుందని ఓ కుమార్తె అత్యంత కిరాతకంగా తల్లిని హత మారిస్తే, ఇప్పుడు ఒక కుమారుడు బ్రతికుండగానే తల్లిదండ్రులను సజీవదహనం చేసి రక్త సంబంధానికే మాయని మచ్చగా మిగిలాడు. వృద్ధాప్యంలో చివరి దశలో ఉన్న తల్లిదండ్రులను పోషించాల్సిన కుమారుడు వారి పాలిట కాలయముడయ్యాడు.. కర్కోటకుడు గా మారాడు.
బ్రతికుండగానే తల్లిదండ్రులనే సజీవదహనం చేసాడు. అయితే ఇంతటి దారుణానికి పాల్పడ్డానికి కారణం భూవివాదాలేనని తెలుస్తుంది. మడిపల్లి గ్రామానికి చెందిన కేతియా అనే వ్యక్తి 65 ఏళ్ల తండ్రి దశ్రు , 61 ఏళ్ల తల్లి బాజీ లను ఇంట్లోనే సజీవ దహనం చేశాడు. తనకు భూమి ఇవ్వలేదనే కోపంతో మద్యం మత్తులో గుడిసిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో గుడిసెలో ఉన్న తండ్రి దశ్రు, తల్లి బాజీ సజీవ దహనం అయ్యారు.మంటల్లో కాలి బూడిదయ్యారు. ఎకరం భూమి తన ఇవ్వలేదని కోపంతో కేతియా తల్లిదండ్రులు సజీవదహనం చేశాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి గ్రామానికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు.