విద్యార్థిలా మారిన ఎమ్మెల్యే.. పరీక్షలు రాసిన జీవన్ రెడ్డి
హన్మకొండ : విద్యార్థి దశలో చదువు ఆపేసిన కొందరు .. మళ్లీ చదివేందుకు ఆసక్తి కనబరుస్తారు. పరీక్షలు రాస్తూ విద్య పట్ల తమకున్న ఇంట్రెస్ట్ చాటుతుంటారు. కొందరేమో ఇంటి పరిస్థితుల వల్ల చదువును మధ్యలోనే ఆపితే .. మిగతా వాళ్లు రకరకాల కారణాలతో దూరమవుతారు. ఉన్నత విద్య కోసం పార్ట్ టైం చదువుతూ మంచి పేరు దక్కించుకున్న వారు చాలామంది ఉన్నారు. ఆ జాబితాలో చేరారు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి.
జీవన్ రెడ్డి ఎన్ఆర్ఐ. 2014 ఎన్నికలకు ముందు ఇండియా వచ్చిన ఆయన .. టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి అసెంబ్లీకి నుంచి పోటీచేసి గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయదుందుభి మోగించారు. ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల కోసం పాటుపడుతున్న జీవన్ రెడ్డికి ఎక్కడో వెలితి. లా చదవాలనే అభిలాషతో ఎల్ఎల్బీ చేశారు. కానీ ఆయనలో ఇంకా ఎక్కడో అసంతృప్తి నెలకొంది. దీంతో న్యాయశాస్త్రంలో ఉన్నత విద్య చదవాలని నిర్ణయించుకున్నారు. ఏడాది కిందట హన్మకొండలోని ఆదర్శ్ కాలేజీలో ఎల్ఎల్ఎం డిస్టన్స్ కోర్సులో చేరారు. ఎల్ఎల్ ఎంలో ఇప్పటికే రెండు సెమిస్టర్లు విజయవంతంగా పూర్తిచేశారు. తాజాగా మూడో సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యారు. సుబేదారిలోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లా కాలేజీలో తోటి విద్యార్థులతో కలిసి పరీక్షలు రాస్తున్నారు జీవన్ రెడ్డి.
ఎల్ఎల్బీ చేశాక న్యాయశాస్త్రంలో ఉన్నత విద్య చదవాలని ఆదర్శ్ కాలేజీలో చేరినట్టు తెలిపారు జీవన్ రెడ్డి. ఇప్పటికే రెండు సెమిస్టర్ పరీక్షలు పాసయ్యానని చెప్పారు. సోమవారం నుంచి మూడో సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నానని పేర్కొన్నారు. మరో సెమిస్టర్ రాస్తే ఎల్ఎల్ఎం కోర్సు పూర్తవుతుందని చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత పరీక్ష రాయటంతో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయన్నారు జీవన్ రెడ్డి. విద్యార్థి దశలో రాసిన పదో తరగతి, ఇంటర్ పరీక్షల సమయం గుర్తొచ్చిందని చెప్పారు.