విషాదమా, విజయమా : చనిపోయి గెలిచిన వార్డుమెంబర్..!
వరంగల్ : చనిపోయి గెలిచాడు. గ్రామస్థుల హృదయాలు దోచుకుని విజేతగా నిలిచాడు. కానీ గెలుపు తాలూకు ఆనందం పంచుకోవడానికి ఆయన లేడు. ఇదంతా చదవడానికి అదోలా ఉన్నా.. స్టోరీలోకి వెళితే అసలు విషయం బోధపడుతుంది. పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకున్న ఈ ఘటన మనసులను కదిలిస్తోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గార్ల మండలం రాజతండాకు చెందిన బానోతు భాస్కర్ (కాంగ్రెస్ మద్దతుదారుడు)... తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్ గా నిలబడ్డాడు. మూడో వార్డు నుంచి ఎన్నికల బరిలోకి దిగాడు. అయితే సోమవారం నాడు ఎలక్షన్లు జరగాల్సి ఉండగా ఆదివారం నాడు చనిపోయాడు. అనారోగ్యం కారణంగా సరిగ్గా ఎన్నికలకు ఒకరోజు ముందు చనిపోవడం స్థానికంగా విషాదం నింపింది. గ్రామస్థులంతా భాస్కర్ మృతదేహం చూసి చలించిపోయారు.
భాస్కర్ చనిపోవడంతో ఆయన ప్రత్యర్థికి పోటీ లేనట్లే కదా. అయితే చనిపోయిన భాస్కర్ కు అత్యధికంగా ఓట్లు వచ్చి గెలుపొందాడు. సోమవారం సాయంత్రం రిలీజ్ చేసిన ఫలితాల్లో భాస్కర్ కు 44 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి శ్రీనివాస్ కు 25 ఓట్లు వచ్చాయి. భాస్కర్ చనిపోయాడని తెలిసి కూడా ఓటర్లు ఆయన వైపే మొగ్గు చూపారు. అతడికే ఓట్లు వేశారు. చనిపోయిన భాస్కర్ వార్డు మెంబర్ గా గెలవడంతో.. ఆయనది అదృష్టమో, దురదృష్టమో అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు.