పుట్టిన రోజునాడే దారుణం : వరంగల్ లో యువతిపై గ్యాంగ్ రేప్.. ఆపై హత్య
ఎంతో సంతోషంగా పుట్టినరోజు జరుపుకోవాలని భావించిన ఆ యువతి ఊహించని విధంగా దారుణ హత్యకు గురైంది. హన్మకొండలో జరిగిన ఈ దారుణంలో యువతిని గ్యాంగ్ రేప్ చేసి హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ దారుణం స్థానికంగా సంచలనంగా మారింది. పుట్టినరోజు నాడే దారుణంగా అత్యాచారానికి గురై ఓ యువతి మరణించిన తీరువరంగల్ జిల్లాలో తీవ్ర విషాదాన్నినింపింది.
పుట్టిన రోజు నాడే మానస మరణం ..అత్యాచారం చేసి దారుణహత్య
దీన్ దయాల్ నగర్ లో నివాసముండే మానస బుధవారం తన పుట్టిన రోజు కావడంతో గుడికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్ళింది. గుడికి వెళ్లిన కూతురు ఎంతకీ రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఫోన్ చేస్తే మానస ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో తల్లిదండ్రులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. రాత్రి పది గంటల ప్రాంతంలో హంటర్ రోడ్డు సమీపంలో బుధవారం రాత్రి స్థానికులు కొందరు ఆ యువతి మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా హనుమకొండ పోలీసులు అనుమానాస్పద మృతిగా భావించి కేసు నమోదు చేశారు.
సంఘటనా స్థలంలో బీరు సీసాలు .. గ్యాంగ్ రేప్ అనుమానం
అయితే సంఘటన స్థలానికి కొద్దిదూరంలో బీరు సీసాలు, అమ్మాయి చెప్పులు ఉండటంతో అత్యాచారానికి గురైనట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలో ఒకరి కంటే ఎక్కువమంది ఉన్నారని అక్కడ ఉన్న బీరు సీసాలు ఆధారంగా గుర్తించిన పోలీసులు యువతి గ్యాంగ్ రేప్ కు గురయ్యిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న సిసిటివి ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు పోలీసులు.
పుట్టిన రోజున మానస ఎవర్ని కలిసింది అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు
పుట్టిన రోజు ఇంట్లో చెప్పిన మానస ఎక్కడికి వెళ్లింది? ఎవరెవరిని కలిసింది అన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు. మానస సెల్ ఫోన్ లోని కాల్ డేటా ఆధారంగా ఆమె ఎవర్ని కలిసిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మానస కు తెలిసిన వాళ్ళు చేసిన పనేనా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల నుండి మానస స్నేహితులకు సంబంధించిన వివరాలు సేకరించి వారిని సైతం విచారిస్తున్నారు.
మానస గ్యాంగ్ రేప్ లో ప్రధాన నిందితుడి అరెస్ట్ ? ... రహస్యంగా విచారిస్తున్న పోలీసులు
మానసను అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు మానస గ్యాంగ్ రేప్ కు సంబంధించి ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. సాయితో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని పోలీసులు రహస్య విచారణ జరుపుతున్నారు. మానస మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక వస్తే మానస హత్య మిస్టరీ లో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.