కారు జోరుకు కళ్లెం.. బీజేపీతోనే సాధ్యం..! హైకమాండ్ స్ట్రాటజీ ఇదేనా?
వరంగల్ : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? ఇతర పార్టీలకు దారి లేకుండా చేసి ఏకఛత్రాధిపత్యంతో దూసుకెళుతున్న టీఆర్ఎస్కు బ్రేకులు పడనున్నాయా? గులాబీ రెపరెపలు తప్ప హస్తం, కమలం హవా లేకుండా పోయిన తరుణంలో టీఆర్ఎస్ను ఢీకొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి.
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటలేకపోయింది. దాంతో మరోసారి టీఆర్ఎస్ హవా కొనసాగింది. అయితే కారు జోరుకు కళ్లెం వేయడానికి తెలంగాణలో అల్టర్నేట్ పార్టీ లేకుండా పోయిందనే వాదనలున్నాయి. ఆ నేపథ్యంలో కమలనాథులు మేమున్నాముగా అంటూ దూకుడు పెంచారు. వచ్చే శాసనసభ ఎన్నికలనాటికి బీజేపీ బలమేంటో చూపిస్తామంటున్నారు.
టీఆర్ఎస్కు అల్టర్నేట్ బీజేపీయేనా?
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ శక్తిని ఎదుర్కోలేని కాంగ్రెస్ మహాకూటమిగా అవతరించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. 119 అసెంబ్లీ స్థానాలకు వంద మినహాయించి కేవలం పై 19 స్థానాలకే పరిమితమైంది. టీఆర్ఎస్ మాత్రం 88 స్థానాల్లో గెలిచి మరోసారి సత్తా చాటింది. ప్రజల మద్దతు తమకే ఉందని మరోసారి నిరూపించుకుని రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరిని ఇప్పటికే కారెక్కించారు గులాబీ నేతలు.
కారు జోరుతో కాంగ్రెస్ పార్టీ డీలా పడినట్లైంది. దాంతో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేకుండా పోయిందనే వాదనలున్నాయి. ఆ క్రమంలో బీజేపీ హైకమాండ్ తెలంగాణ వైపు దృష్టి సారించింది. మొన్నటి పార్లమెంటరీ ఎన్నికల్లో 303 స్థానాలు గెలుచుకుని కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కొన్ని రాష్ట్రాల్లో బలం పుంజుకోవాలని డిసైడయింది. ఆ క్రమంలో తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది.
మూడేండ్ల కిందట లంచం.. ఇంతవరకు పనిగాలే.. వీఆర్వోపై తిరగబడ్డ రైతులు..! (వీడియో)
సోషల్ మీడియాను వాడేస్తున్నారుగా.. పెద్దఎత్తున సభ్యత్వాలు..!
తెలంగాణపై బీజేపీ అధిష్టానం కన్నేసింది. టీఆర్ఎస్కు దీటుగా బలం పుంజుకుని వచ్చే ఎన్నికల నాటికి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడానికి ఉవ్విళ్లూరుతోంది. ఆ క్రమంలో తొలుత సభ్యత్వ నమోదుపై దృష్టి సారించింది. సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన మోడీ, అమిత్ షా ద్వయం వేసిన ప్లాన్ వర్కవుట్ అవుతున్నట్లే కనిపిస్తోంది. పెద్ద ఎత్తున యువత కమలం గూటిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా జస్ట్ ఓ లింక్ను షేర్ చేస్తున్నారు బీజేపీ నేతలు. అందులో వివరాలు నమోదు చేస్తే చాలు దాన్నుంచి మెంబర్షిప్ తీసుకోవచ్చనే ఆలోచనకు యువత అట్రాక్ట్ అవుతోంది.
అదలావుంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. రానున్న రెండేళ్లలో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయని వ్యాఖ్యానించడం దేనికి సంకేతమనే వాదనలు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో విఫలం.. లోక్సభ ఎన్నికల్లో బలం.. ఈసారేమో..!
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురైంది. అంతకుముందు ఐదు స్థానాలను కైవసం చేసుకున్న కమలం పువ్వు ఈసారి మాత్రం ఒకే స్థానానికి పరిమితమైంది. బీజేపీ నుంచి ఒకే ఒక్కడిగా గోషామహాల్ నుంచి రాజాసింగ్ మాత్రమే గెలుపొందారు. మిగిలిన నాలుగు చోట్ల అపజయం ఎదురైంది. అదలావుంటే లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ సత్తా చాటింది. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లో గెలిచి తెలంగాణలో తమకు బలముందని నిరూపించుకుంది.
నాలుగు చోట్ల బీజేపీ గెలుపనేది ఢిల్లీ పెద్దలు సైతం ఊహించి ఉండలేదేమో. మొత్తానికి నాలుగు ఎంపీ స్థానాలు కమలం బుట్టలో పడటంతో పార్టీశ్రేణుల్లో జోష్ పెరిగింది. అటు హైకమాండ్ కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. దాంతో తెలంగాణలో తమ పార్టీకి బలముందని నమ్ముతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పుంజుకోవాలని స్కెచ్ వేస్తున్నారు.
పడింది పంచ్.. ఆర్టీసీ బస్సు సీజ్.. లెక్క తప్పిందిగా? (వీడియో)
కారు, హస్తం అసంతృప్తులే టార్గెట్.. వరంగల్ కోటపై కన్ను?
కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడం.. తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలు గెలవడం.. మోడీ ఛరిష్మా.. అమిత్ షా వ్యూహం.. వెరసి రాష్ట్రంలో బీజేపీ బలం పెంచేందుకు అడుగులు పడుతున్నాయి. ఆ క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ కూడా మొదలెట్టారు కమలనాథులు. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్తులకు కాషాయం కండువా కప్పేందుకు సిద్ధమయ్యారు. అందులోభాగంగా టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను కమలం గూటికి రప్పించారు.
అదలావుంటే రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ పోషించే వరంగల్ కోటపై బీజేపీ నేతలు ప్రధానంగా దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. కొండా సురేఖ దంపతులతో పాటు గండ్ర సత్యనారాయణ బీజేపీలో చేరే అవకాశాలున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరి.. అక్కడ పొసగక మళ్లీ హస్తం గూటికి చేరిన కొండా దంపతులు రాజకీయ భవిష్యత్ కోసం కమలం వైపు చూస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కొండా దంపతులతో పాటు గండ్ర సత్యనారాయణ బీజేపీలో చేరితే వరంగల్ జిల్లా రాజకీయాల్లో కాషాయం జోరు పెరగనుందనే వాదనలు వినిపిస్తున్నాయి.