అందాల జలపాతం ఉగ్రరూపం.. పర్యాటకులు జర భద్రం..! (వీడియో)
Recommended Video
వరంగల్ : తెలంగాణా నయాగరాగా పేరుగాంచిన బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అందాల జలపాతానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఇటీవల విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో బొగత వాటర్ ఫాల్స్ జలకళ సంతరించుకుంది. భారీగా వరద నీరు చేరడంతో ఉద్దృతంగా ప్రవహిస్తోంది. ఆ క్రమంలో పర్యాటకులు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు ఫారెస్ట్ డిపార్టుమెంట్ అధికారులు.
భారీగా వరద నీరు.. బొగతకు జలకళ
ప్రమాదకర స్థాయిలో నీటి ప్రవాహం పెరిగినట్లు అక్కడి ఫారెస్ట్ డిపార్టుమెంట్ అధికారులు చెబుతున్నారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు వరద తీవ్రత తగ్గేంతవరకు రాకపోవడమే బెటరని సూచిస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే షెడ్యూల్ వేసుకుని కచ్చితంగా రావాలని ప్రయత్నించేవారు మాత్రం అటవీ శాఖ సిబ్బంది సూచనలు ఫాలో కావాల్సిందిగా కోరారు.
అలాగే ఫెన్సింగ్ దాటి ఎట్టిపరిస్థితుల్లో ముందుకెళ్లరాదని చెబుతున్నారు. ఇక మద్యం సేవించి వచ్చే వారిని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. వరద ప్రవాహం తగ్గేంతవరకు అటవీశాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు.
తిరుమల లడ్డూ పుట్టిన రోజు.. సోషల్మీడియాలో శుభాకాంక్షలు.. ఇంతకు ఎన్నేళ్లు..!
ఎటుచూసినా అందాలే.. కనువిందులే..!
బొగత జలపాతం ప్రకృతి అందాలకు పుట్టినిల్లుగా చెప్పొచ్చు. వాటర్ ఫాల్స్కు వెళ్లే మార్గంలో సుందర దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. బొగత విహారయాత్ర జీవితంలో మరచిపోలేని అందమైన అనుభూతి మిగులుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఎత్తైన కొండలు, దట్టమైన అడవి, పక్షుల కిలకిల రావాలు, ఆకట్టుకునే పచ్చిక బయళ్లు.. ఇలా ఎలా చూసినా బొగత జలపాతం వీకెండ్ వండర్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు.
గుట్టల నడుమ నుంచి వంద మీటర్ల ఎత్తు నుంచి కిందకు జాలువారే వాటర్ ఫాల్స్ సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. టూరిస్ట్ స్పాట్గా ఇక్కడకు తెలుగు రాష్ట్రాల నుంచే గాకుండా చత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా టూరిస్టులు క్యూ కడుతున్నారు. బోగత జలపాతంలో ఏడాది పొడవునా నీరు ప్రవహిస్తున్నప్పటికీ, జూన్ నుంచి నవంబర్ మధ్య వరద నీరు ఎక్కువగా చేరుతుండటంతో పర్యాటకులను మరింత ఆకట్టుకుంటోంది.
వీకెండ్ వచ్చింది.. పర్యాటకులు జాగ్రత్త
బొగత జలపాతం అందాలు కనులారా వీక్షించడానికి టూరిస్టులు పెద్దసంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. ప్రకృతి ఒడిలో సేదతీరుతూ తమ కష్టాలను మరచిపోతుంటారు. పై నుంచి జాలువారే వాటర్ ఫాల్స్ను వీక్షిస్తూ జల ప్రవాహంలో తడిసి ముద్దవుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే మామూలు రోజుల్లో నీటి ప్రవాహం తక్కువగా ఉంటుంది. అలా పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులుండవు. కానీ ప్రస్తుతం భారీగా వరద నీరు చేరుతుండటంతో బొగ త జలపాతంలో ప్రవాహం ఎక్కువగా ఉంది.
వీకెండ్ కావడంతో పర్యాటకులు ఇప్పటికే బొగత జలపాతం అందాలు వీక్షించడానికి ప్లాన్ చేసుకుని ఉంటారు. అయితే ప్రస్తుత పరిస్థితులతో అక్కడకు వెళ్లకపోవడమే బెటర్. నీటి ప్రవాహం తగ్గేంతవరకు బొగత జలపాతం టూర్ పోస్ట్పోన్ చేసుకోవడం బెటర్. ఒకవేళ ఇప్పటికే బయలుదేరిన పర్యాటకులు మాత్రం జర జాగ్రత్త. అటవీ సిబ్బంది సూచనలు ఫాలో అవుతూ వీకెండ్ డెస్టినెషన్ టూరును అందంగా మలచుకోండి.