తెలంగాణను దివాళా తీయించారు.. హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తున్నారు : భట్టి
వరంగల్ : సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించారంటూ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క. బంగారు తెలంగాణ అంటూ కల్లిబొల్లి మాటలు చెబుతూ అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ భట్టి మండి పడ్డారు.
రాయపర్తి మండలం కిష్టాపురం క్రాస్ రోడ్డు సమీపంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు భట్టి. ఆ సందర్భంగా అక్కడకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్న సీఎం కేసీఆర్.. తెలంగాణను అప్పులో ఊబిలోకి దించుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్న ఘనత కేసీఆర్ సొంతమని ఎద్దేవా చేశారు.
యెల్లో యెల్లో తంగేడు పూలు.. మల్లెను మించిన గునుగు పూలు.. బతుకమ్మ సంబురాలు షురూ
హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్న కేసీఆర్కు సమయం వచ్చినప్పుడు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు భట్టి. హుజుర్నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. అది జీర్ణించుకోలేక పోతున్న కేసీఆర్ టీఆర్ఎస్ నేతలను పెద్ద ఎత్తున మోహరించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. మండలానికో మంత్రిని.. గ్రామానికో ఎమ్మెల్యేను నియమిస్తూ వారికి ఓట్లు వేయించే బాధ్యత అప్పజెప్పుతున్నారని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు.