అసంతృప్తి... వినయ్ భాస్కర్ కు మంత్రిగా నో ఛాన్స్ ? .. ఉద్యమకారుల స్థానం ఇదేనా ? ఓరుగల్లులో చర్చ
ఆయన వరంగల్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీలో కీలక నేత, ఉద్యమ కాలం నుంచి పనిచేసిన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధనకై లాఠీ దెబ్బలు తిన్న ఎమ్మెల్యే. ఆయనే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. ఈసారైనా మినిస్టర్ వినయ్ భాస్కర్ అని పిలుస్తామని భావించిన వరంగల్ వాసులు సీఎం కేసీఆర్ నిర్ణయంతో నిరాశకు గురయ్యారు. మంత్రి వర్గంలో ఆయనకు స్థానం ఇవ్వకపోవటంపై తీవ్రఅసంతృప్తికి లోనయ్యారు.
వినయ్ భాస్కర్ కు మంత్రి అవకాశం గత క్యాబినెట్లో లేదు ... ఇప్పుడూ లేదు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత కేబినెట్లో వినయ్ భాస్కర్ కుచోటు దక్కుతుందని భావిస్తేఅప్పుడు పార్లమెంటరీ సెక్రటరీ పదవితో సరిపెట్టారు.పార్లమెంట్ సెక్రటరీలను రద్దు చేస్తూ కోర్టు తీసుకున్న నిర్ణయంతో అది కాస్తా లేకుండానే పోయింది.ఇక ఈ కేబినెట్ విస్తరణలో అయినావినయ్ భాస్కర్కు చోటుదక్కుతుంది అనుకుంటేసీఎం కేసీఆర్వినయ్ భాస్కర్ కు మొండి చెయ్యిఇచ్చారు. దీంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు, అలాగే దాస్యం వినయ్ భాస్కర్ అనుచరులకు నిరాశే మిగిలింది.
పార్టీ కోసం నిబద్ధతతో పని చేసిన వినయ్ కు మొండిచెయ్యి
టిడిపి నుంచి టిఆర్ఎస్ కు వలస వచ్చిన నాయకుడు,సీఎం కేసీఆర్ ను గతంలో దూషించిన నాయకుడైన ఎర్రబెల్లి దయాకర్ రావు కు పట్టం కట్టి,తెలంగాణ రాష్ట్ర సమితి కోసం నిబద్ధతతో పని చేసిన నాయకుడిని పక్కన పెట్టారంటూ వరంగల్ జిల్లాలోని టీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ జిల్లాలో ముందుండి నడిపించిన నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ కి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో జిల్లాలో అసహనం నెలకొంది. ఉద్యమం కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టిసీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహులకు పట్టం కట్టడం పైన ఆగ్రహం వ్యక్తమవుతున్నా అది నివురుగప్పిన నిప్పులానే ఉంది.
గత కేబినెట్లోనూ వలసదారులకే పట్టం కట్టిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత టిఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. దాంతో కొత్త రాష్ట్రంలో కేసీఆర్ కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలోనూ, పార్టీ ఆవిర్భావం నుంచి వున్న వాళ్లకి పెద్దగా క్యాబినెట్లో స్థానం దక్కలేదు. ఈటెల రాజేందర్, జి.జగదీష్రెడ్డి, కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, తన్నీరు హరీష్రావు టి. పద్మారావు గౌడ్, అజ్మీరా చందూలాల్, మొహమూద్ అలీలకు మాత్రమే పదవులు దక్కాయి. ఇక ఉద్యమంలో పాల్గొనని, టీడీపీ నుంచి తెరాసకు వచ్చిన పట్నం మహేందర్రెడ్డి, కడియం శ్రీహరి, జోగు రామన్న, పోచారం శ్రీనివాసరెడ్డి, సి.లక్ష్మారెడ్డి, జూలపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ఏ. ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్లకు మంత్రి పదవులు దక్కాయి.
ఉద్యమంలో పనిచేసిన వారికి ప్రాధాన్యతనివ్వని కేసీఆర్
ఉద్యమ కాలం నుంచి పార్టీలో వున్నా, తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగిన ఉద్యమంలో పలు కేసుల్లో ఇరుక్కున్నప్పటికీ పార్టీ కోసం కీలకంగా పనిచేస్తున్న వారికి మాత్రం కేసీఆర్ మొండి చెయ్యిచ్చి తొలి దఫా అవమానించారు. ఇక తాజాగా ఈసారైనా అవకాశం ఇస్తారని ఓపికగా వున్న వాళ్లకి రెండవ సారి కూడా అవమానమే ఎదురైంది. 2009 నుంచి తెరాస పార్టీలోనూ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ వరంగల్ జిల్లాలో తన వంతు పాత్రని సమర్థవంతంగా పోషించిన నేత దాస్యం వినయ్భాస్కర్, ఉద్యమ సమయంలో జగన్ను మహబూబాబాద్లో అడుగుపెట్టనీయకుండా కొండా దంపతులకు ముచ్చెమటలు పట్టించడంలో వినయ్భాస్కర్ అప్పట్లో కీలక పాత్ర పోషించారు. అలాంటి నేతను గులాబీ అధినేత ఇప్పటికీ గుర్తించడం లేదు.
వినయ్ భాస్కర్ కి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో వరంగల్ జిల్లాలో నేతల అసంతృప్తి
బీసీ సామాజిక వర్గానికి చెందిన వినయ్ భాస్కర్ కు కుల సమీకరణాలలో భాగంగా కూడా ప్రాధాన్యం ఇవ్వని కేసీఆర్ టీడీపీలో వున్న సమయంలో కేసీఆర్ను దారుణంగా అవమానించి ఆ తరువాత తెరాసలో చేరిన ఎర్రబెల్లి దయాకర్రావుకు మంత్రి వర్గంలో స్థానం కల్పించి వినయ్భాస్కర్ను పక్కన పెట్టడం జిల్లా స్థానిక నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. దశాబ్ద కాలంగా పార్టీకి సేవ చేస్తే కేసీఆర్ ఇచ్చిన బహుమతి ఇది అని అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఉద్యమంలో వున్న వాళ్లని కేసీఆర్ దారుణంగా అవమానిస్తున్నారని, ఉద్యమం ఎవరి కోసం చేశామో అర్థం కావడం లేదని పలువురు వినయ్ మద్దతుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నా, వినయ్ భాస్కర్ మాత్రం ఇంకా సంయమనంతో ఎదురుచూస్తున్నారు. అయితే పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కు ప్రభుత్వ విప్ ఇవ్వనున్నట్లు గా తెలుస్తోంది . ఏది ఏమైనప్పటికీ వినయ్ భాస్కర్ కు మంత్రి పదవి ఇస్తే బాగుండేది అన్న టాక్ వరంగల్ జిల్లాలో ప్రధానంగా వినిపిస్తుంది.