ఇంజనీరింగ్ కాలేజీలో కుక్కల బీభత్సం.. విద్యార్థినిపై దాడి, పరిస్థితి విషమం..!
వరంగల్ : జిల్లాలోని నర్సంపేట మండలం లక్నెపల్లి శివారులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం జరిగింది. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిపై కుక్కలు దాడి చేయడం కలకలం రేపింది. ఒక్కసారిగా కుక్కల గుంపు దాడి చేయడంతో సదరు విద్యార్థిని తప్పించుకోలేక పోయింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చానీయాంశమైంది. రమ్య అనే విద్యార్థిని హాస్టల్లో ఉంటూ ఇక్కడి కాలేజీలో బీటెక్ చదువుతోంది. అయితే ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం క్లాసులకు హాజరయ్యేందుకు వెళుతున్న తరుణంలో కాలేజీ ప్రాంగణంలో ఒక్కసారిగా ఆమెపై కుక్కులు దాడి చేసినట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అదే కారణమా! అసత్య ప్రచారమంటూ..
కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో రమ్య తేరుకోలేక పోయింది. ఊహించని పరిణామంతో అక్కడే కుప్పకూలి పోయింది. అది చూసిన తోటి విద్యార్థులు కుక్కల గుంపును తరిమేసి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే రమ్యకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. వెంటనే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అదలావుంటే శుక్రవారం నాడే కాలేజీలో ఫ్రెషర్స్ డే నిర్వహిస్తుండటంతో ఈ ఘటన కొత్తగా చేరిన విద్యార్థులను కలవరపెడుతోంది. తోటి విద్యార్థినిపై ఇలా కుక్కలు దాడి చేసి గాయపర్చడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. రమ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో కాలేజీ ఎదుట విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.