కాంగ్రెస్ను వీడేది లేదు.. పార్టీ మార్పు ప్రచారంపై కొండా మురళి
టీ పీసీసీ చీఫ్ ఎంపికలో ఆలస్యం.. అధి నాయకత్వం కోపం... వలసల పర్వం... ఇదీ కొందరు కాంగ్రెస్ నేతల్లో అలజడికి కారణమవుతోంది. ఇలానే వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేత కొండా మురళీ పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. దీనిపై ఇదివరకే మురళీ ఖండించారు. తాజాగా మరోసారి మీడియా ప్రతినిధులు అడగగా.. అదేం లేదు అని.. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని కొండా మురళి స్పష్టంచేశారు. ఇదివరకు తాను ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో వివరించారు. తనకు వరంగల్ తూర్పు టికెట్ ఇవ్వనందుకే టీఆర్ఎస్ పార్టీలో చేరాల్సి వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో తనకు ప్రాధాన్యం ఉంటే.. అప్పుడే పార్టీని వీడబోనని తేల్చిచెప్పారు. కానీ అలాంటి పరిస్థితి కల్పించడంతో పార్టీని వీడాల్సి వచ్చిందని తెలిపారు. తర్వాత ఇతర పార్టీల్లో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పారు. తొలుత బానే ఉన్నా.. తర్వాత పక్కనపెట్టడం చేశారని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ దొరల పార్టీ అంటూ కొండా మురళి ధ్వజమెత్తారు. ఆ పార్టీలో మిగతా నేతలకు అంతగా ప్రాధాన్యం ఉండదని చెప్పారు. అవసరం కోసం వాడుకుంటారని పేర్కొన్నారు. తమను కూడా టీఆర్ఎస్ పార్టీ అలానే చేసిందని.. టికెట్ల విషయం వచ్చేసరికి పక్కన పెట్టడం చేశారని తెలిపారు. ఇక తప్పక తమ సొంతగూటికి వచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీలో తమకు తగిన ఇంపార్టెన్స్ ఇస్తున్నారని తెలిపారు. ఇదే విషయాన్ని ఇటీవల తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మానిక్కం ఠాగూర్ను కలిసిన సమయంలో చెప్పానని వివరించారు.
కొత్త పీసీసీ అధ్యక్షుడిపై కూడా తమ అభిప్రాయాన్ని తెలిపానని చెప్పారు. ఎవరూ పగ్గాలు చేపట్టిన అనుకూలంగా ఉంటామని పేర్కొన్నారు. వారితో కలిసి పనిచేస్తామని కొండా మురళి స్పష్టంచేశారు