మాట కలిపి.. మత్తుమందిచ్చి.. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో దోపిడీ
కాజీపేట : రైల్లో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ప్రయాణీకులకు మత్తుమందు ఇచ్చి అందినకాడికి దోచుకెళ్లారు. యశ్వంత్పూర్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వరకు ప్రయాణించే సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ఈ ఘటన జరిగింది. ఆరుగురు ప్రయాణీకులను మాటలతో ముగ్గులోకి దించి.. ఆ తర్వాత మత్తుమందిచ్చి దోపిడికి పాల్పడ్దారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు బాధితులు కర్ణాటకలో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆదివారం నాడు సొంతూళ్లకు వెళ్లేందుకు సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో బయలుదేరారు. అయితే ధర్మవరం రైల్వే స్టేషన్ దాటాక.. తోటి ప్రయాణీకుల్లా నటించిన దోపిడి దొంగలు వారితో మాట కలిపారు. కాస్తా చనువు పెరిగాక మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్స్, బిస్కెట్లు ఇవ్వడంతో బాధితులు స్పృహ కోల్పోయారు. అదే అదనుగా వారి నుంచి నగదు, వాచీలు, గోల్డ్ రింగులు, సెల్ఫోన్లు దోచుకుని తర్వాత స్టేషన్లో దిగిపోయినట్లు సమాచారం.
పోలీసుల్లో ఇలాంటి సీఐ వేరయా..! దండాలు, గులాబీలతో గాంధీమార్గం
విషయం తెలిసి జీఆర్పీ పోలీసులు అలర్టయ్యారు. రైలు కాజీపేటకు చేరుకోగానే బాధితులకు మొదటగా వైద్యం అందించే నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వారు స్పృహలోకి వచ్చాక విషయం పూర్తిగా తెలుసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు.