ఎన్కౌంటర్స్: గడ్చిరోలిలో ఐదుగురు మావోయిస్టులు మృతి, ములుగులో ఇద్దరు
వరంగల్: ములుగు జిల్లా మంగపేట అటవీ ప్రాంతంలో ఆదివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదరురుకాల్పులు జరిగాయి. మంగపేట అటవీ ప్రాంతంలోని ముసలమ్మగుట్ట అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు తారసపడటంతో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ముందుగా మావోయిస్టులు కాల్పులు జరపడంతో.. పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అయితే, ఎదురుకాల్పుల ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు.
గడ్చిరోలిలో ఎదురుకాల్పులు: ఐదుగురు మావోలు మృతి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. కోస్మి-కిస్నేలి అటవీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. మృతి చెందినవారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని గడ్చిరోలి ఎస్పీ తెలిపారు.
గడ్చిరోలి పోలీసు బలగానికి చెందిన సీ-60 కమాండోలు ధనోరా తాలూకాలో ఆదివారం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. దీంతో కమాండోలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించినట్లు ఎస్పీ తెలిపారు. అయితే, మృతి చెందిన మావోయిస్టుల వివరాలు తెలియరాలేదు.