కరోనా సోకిందని ఇళ్లకు రానీయలేదు.. గుట్టల్లోనే తలదాచుకున్న కానిస్టేబుళ్లు
మహబూబాబాద్: కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న కానిస్టేబుళ్ల దయనీయ పరిస్థితికి ఈ ఘటన అద్దంపడుతోంది. కరోనా లాక్డౌన్ సమయంలో విధులు నిర్వహించిన ఇద్దరు స్పెషల్ పార్టీకి చెందిన కానిస్టేబుళ్లు సారంగపాణి, కృష్ణలకు కరోనా సోకింది. అయితే, తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలోని ప్రత్యేక పోలీసు దళంలో పనిచేస్తున్న సుమారు 20 మంది కానిస్టేబుళ్లకు కరోనా సోకడంతో వారికి హోంఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. అయితే, తమలో ఒకరు అద్దె ఇంట్లో ఉంటుండగా, ఆ ఇంటి యజమాని కుటుంబంలో వివాహం ఉండటంతో లోనకు రావొద్దని చెప్పారని తెలిపారు.
ఇంకొకరి ఇంట్లో చిన్నపిల్లలు ఉండటంతో వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు. ఇక తామిద్దరం ఆస్పత్రిలోనే ఉంటామంటే రెండురోజుల తర్వాత వసతి చూపిస్తామని వైద్యాధికారులు చెప్పారని తెలిపారు. దీంతో దిక్కుతోచక జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపాన గల గుట్టల ప్రాంతంలో తలదాచుకుంటున్నామని తెలిపారు.
Recommended Video
అధికారులు వెంటనే స్పందించి తాము ఆస్పత్రిలో చికిత్స పొందేలా చూడాలని వేడుకుంటున్నారు ఈ కరోనా వారియర్స్. ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు గుట్టల్లో ఆశ్రయం పొందుతున్న విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో ఎస్పీ కోటిరెడ్డి స్పందించారు. ఇంటి యజమానులతో పాటు కానిస్టేబుళ్లతో చర్చించారు. దీంతో సోమవారం రాత్రి ఇళ్లకు చేరుకున్నారు. ఇలాంటి పరిస్థితులు వైద్యులు, వైద్య సిబ్బంది కూడా ఎదుర్కొంటుండటం గమనార్హం.