కంచే చేను మేస్తే .. నకిలీ స్వశక్తి గ్రూపులతో మెప్మా అధికారుల 70 కోట్ల స్కామ్
కంచె చేను మేసిన చందంగా ఉంది నగరంలోని మెప్మా అధికారుల పరిస్థితి. వరంగల్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా అధికారులు పేద మహిళలకు ఆసరాగా ఉండాల్సింది పోయి వారి పేరుతోనే అవినీతికి పాల్పడ్డారు. నకిలీ మహిళా సంఘాలు ఏర్పాటు చేసి ఏకంగా 70 కోట్ల రూపాయల స్కామ్ చేశారు. వందల నకిలీ గ్రూపులతో, నిరుపేద మహిళల పేర్లతో బ్యాంకుల నుండి లోన్లు తీసుకుని తిరిగి వాటిని చెల్లించకుండా టోకరా పెట్టారు. బ్యాంక్ అధికారులు లోన్లు రికవరీ కోసం ప్రయత్నం చేస్తుంటే అసలు బాగోతం బయటపడింది. స్వశక్తి మహిళా సంఘాల పేరుతో లోన్లు తీసుకుంది నిరుపేద మహిళలు కాదని, ఇవన్నీ మెప్మా అధికారులు సృష్టించిన నకిలీ గ్రూపులని తెలియడంతో ఒక్కసారిగా బ్యాంకు అధికారులు షాక్ కి గురయ్యారు.
ఈ స్కామ్ లో ప్రధాన సూత్రదారులు వీళ్ళే.. ప్లాన్ వర్క్ అవుట్ చేసింది ఇలా
మహిళా గ్రూపులకు లోన్లు అందించేందుకు మెప్మా తరఫున 12 మంది సి వో లు కీలకంగా వ్యవహరించేవారు. ఒక్కో సీవో పరిధిలో సుమారు వెయ్యి గ్రూపులు ఉంటాయి. మహిళా గ్రూపులకు లోన్ రావాలంటే సివో సంతకం తప్పనిసరి. దీంతో కొందరు ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకుని పర్సంటేజ్ లు తీసుకోవడం చాలా ఏళ్ళుగా సాగుతోంది. అయితే ఇదే అదునుగా నలుగురు సివో స్థాయి అధికారులు ఒక్క టై పెద్ద మొత్తంలో డబ్బు దండుకునే ప్లాన్ చేశారు. చదువుకోని నిరుపేదలైన పేద మహిళలను స్వశక్తి సంఘాల లో చేరుస్తామని నమ్మబలికి వారి ఫోటోలు, ఆధార్ కార్డులు సేకరించి కొందరు బ్యాంకు అధికారుల సహకారంతో పేద మహిళల పేరుతో లోన్లు తీసుకున్నారు.
ఐదారు వందల నకిలీ గ్రూపులు ...70 కోట్ల స్కామ్
నలుగురు సీవో స్థాయి అధికారులు, కొందరు బ్యాంక్ అధికారుల సహకారంతో ఐదారు వందల నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా 70 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ 70 కోట్ల రూపాయల లోన్లు తీసుకున్న నిరు పేద మహిళలు లోన్లు చెల్లించడం లేదంటూ బ్యాంక్ అధికారులు లోన్ల రికవరీకి థర్డ్ పార్టీ రికవరీ ఏజెంట్ల పంపుతున్నారు. దీంతో అవాక్కవుతున్న పేదలు తాము అసలు లోన్లే తీసుకోలేదంటూ సమాధానమిస్తున్నారు. బ్యాంకు అధికారులు ఎక్కడికి వెళ్లినా ఇట్లాంటి పరిణామాలు ఎదుర్కోవడంతో తీగలాగితే డొంకంతా కదిలింది.బ్యాంక్ అధికారులు లోన్లు వసూలు చేయడం కోసం నానా పాట్లు పడుతుంటే, లోన్లతో సంబంధమే లేని మహిళలు లబోదిబోమంటున్నారు.
మెప్మా అధికారులతో కుమ్మక్కయిన కొందరు బ్యాంక్ అధికారులు
వరంగల్ మెప్మా పరిధిలో మొత్తం 15009 మహిళా గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులో ఉన్న సభ్యుల సంఖ్య చూస్తే సుమారుగా 1,50,090 మంది సభ్యులు ఈ మహిళా గ్రూపులలో ఉన్నారు. ఇక వీరిని సమన్వయం చేయడానికి 526 మంది రిసోర్స్ పర్సన్లు, 12 మంది కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఉన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ సీవో మరో ముగ్గురు మహిళా సీవోలతో కలిసి ఈ స్కామ్ కు తెరతీశారు. ఇక వీరికి కింది స్థాయిలో ఉండే ఆర్ పి లు, కొందరు గ్రూప్ లీడర్లు ,బ్యాంకు అధికారులు కూడా సహకరించినట్లు గా తెలుస్తోంది. దీంతో 70 కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడ్డారు మెప్మా అధికారులు. ఒక్క అలంకార్ జంక్షన్ లోని కెనరా బ్యాంక్ శాఖలోనే 10.5 కోట్ల బకాయిలు ఉన్నాయంటే ఏ మేరకు స్కామ్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
గతంలోనే బయటపడిన అవినీతి... విచారణ గాలికొదిలేసిన అధికార యంత్రాంగం
ఇక గతంలోనే ఈ అవినీతి బాగోతం బయట పడినప్పటికీ ఈ స్కామ్ కు సంబంధించి విచారణ ముందుకు సాగలేదు ఆమ్రపాలి కలెక్టర్ గా ఉన్న సమయంలో బ్యాంక్ అధికారుల ఫిర్యాదు తో ముగ్గురు సీవోలు , నలుగురు ఆర్ పీ లను తొలగించారు ఆమ్రపాలి. దీని మీద ఎంక్వయిరీ కూడా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అది నేటికీ అలానే ఉంది. వరంగల్ నగర వ్యాప్తంగా రోజుకో నకిలీ గ్రూపు బయటపడుతుంది. ఇక ఈ స్కామ్ లో ప్రధాన సూత్రధారికి ఇటీవల ప్రమోషన్ కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైనా దీనిపై విచారణ సాగించకుంటే ఈ అవినీతి తిమింగలాలు మరిన్ని స్కామ్ లకు తెర తీసే ప్రమాదం ఉంది .