16 సీట్లు గెలిపించండి : దేశ రాజకీయ గమనాన్ని మారుస్తా, ఓరుగల్లు గడ్డపై కేసీఆర్
వరంగల్ : 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే దేశ రాజకీయ గమనాన్ని మారుస్తానని హామీనిచ్చారు. మంగళవారం ఓరుగల్లులోని ఆజంజాహీ మిల్లు గ్రౌండ్స్లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
వీరేనా సిఫాయిలు ..?
ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై ఒంటికాలిపై లేచారు కేసీఆర్. వీరిద్దరూ నేతలు దేశంలో తామే ప్రత్యామ్నాయం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ సభ్యులు గెలిపిస్తే .. రాహుల్, మోదీ కూర్చొమంటే కూర్చొవాలి, నిల్చొమంటే నిల్చొవాలని పేర్కొన్నారు. అదే టీఆర్ఎస్ సైనికులు .. తమ సమస్యల కోసం రాజీలేకుండా పోరాడుతారని తెలిపారు.
ప్రధానమంత్రా ? సర్పంచా
మోదీ తన స్థాయి మరచిపోయి మాట్లాడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ప్రధాని పదవీలో ఉండి .. ఆయన పచ్చి అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. సర్పంచ్ స్థాయికి దిగజారి .. జాతకాలు, జ్యోతిష్యం గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి .. యాగాలు, జాతకాలు అని మాట్లాడుతారి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశానికి దశ దిశ
సంక్షేమ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచిలా మారిందని కేసీఆర్ ప్రస్తావించారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే రాజ్యాధికారం చేపడుతాయని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ 100 నుంచి 150 సీట్లకే పరిమితమవుతాయని ... సర్వేలన్నీ అదే విషయం చెబుతున్నాయని పేర్కొన్నారు.
గోల్ మాల్ గోవిందే ..?
ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లు .. టీఆర్ఎస్ పార్టీని, ఉద్యమాన్ని ముందుండి నడిపిందని గుర్తుచేశారు. ఇప్పుడు మరోసారి పసునూరి దయాకర్ ను ఆశీర్వదించాలని కోరారు కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీ గోల్ మాల్ గోవింద పార్టీలని విమర్శించారు కేసీఆర్.