అన్ని ద్వితీయశ్రేణి పట్టణాల్లో ఐటీ విస్తరణ..వరంగల్ అభివృద్ధికి హామీల: మంత్రి కేటీఆర్
వరంగల్లో ఐటీ ఊహించిన దానికంటే వేగంగా విస్తరిస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. నేడు ఐటీ మరియు పురపాలక శాఖామంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్లోని మడికొండలో ఏర్పాటు చేసిన సైయెంట్, టెక్ మహీంద్రా క్యాంపస్లను ప్రారంభించిన ఆయన వరంగల్ యువతకు శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ యువత ప్రతిభ చూసి ఐటీనీ మరింత విస్తరించాలని కేటీఆర్ పేర్కొన్నారు .
వరంగల్ లో సైయెంట్, టెక్ మహీంద్రా క్యాంపస్లను ప్రారంభించిన కేటీఆర్
2018లో వరల్డ్ ఎకనామిక్స్ ఫోరంలో బీవీ మోహన్రెడ్డి, గుర్నానిని కలిశామని చెప్పిన కేటీఆర్ అడిగిన వెంటనే ఇద్దరు వరంగల్లో సంస్థలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారని పేర్కొన్నారు .మడికొండలో క్యాంపస్ ఏర్పాటు చేసిన టెక్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం, నల్లగొండలో ఈ ఏడాదే ఐటీ పార్కులు ప్రారంభిస్తామన్నారు.
హైదరాబాద్-వరంగల్ మధ్య స్కైవే నిర్మాణం, ఎయిర్ పోర్ట్ లపై హామీ
హైదరాబాద్-వరంగల్ మధ్య స్కైవే నిర్మాణం చేపడతామని కేటీఆర్ చెప్పారు . హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు పారిశ్రామిక కారిడార్గా తీర్చిదిద్దుతామని చెప్పిన ఆయన పరకాలలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని చెప్పుకొచ్చారు . గ్రామీణ నియోజకవర్గాల్లో ఆహారశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. మామునూరు విమానాశ్రయం పునఃప్రారంభించడానికి ప్రయత్నిస్తాంఅని కేటీఆర్ వరంగల్ ను పారిశ్రామికంగా, అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఐదేళ్లలో తెలంగాణకు 12 వేల పరిశ్రమలు వచ్చాయన్న కేటీఆర్
ప్రైవేటు రంగంలో పెట్టుబడుల కోసం రెడ్ కార్పెట్ పరిచామన్న ఆయన ఈ ఏడాదిలోనే కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్లో ఐటీ కేంద్రాలు ప్రారంభిస్తామని వెల్లడించారు .వరంగల్ కరీంనగరే కాదు.. రాష్ట్రంలోని అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరిస్తాం అని మంత్రి తెలిపారు.ఐదేళ్లలో తెలంగాణకు 12 వేల పరిశ్రమలు వచ్చాయి. తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలని అవసరమైన ప్రయత్నాలన్నీ చేస్తున్నాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ప్రధాన నగరాలన్నీ అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.