వరంగల్ ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న కేటీఆర్ ... నాలాల అక్రమ నిర్మాణాల తొలగింపుకు మంత్రి ఆదేశాలు
తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు వరంగల్ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలను అక్కడి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. హెలికాప్టర్ ద్వారా హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ మైదానానికి చేరుకున్న మంత్రి కేటీఆర్ ముంపుకు గురైన వరంగల్ ట్రై సిటీస్ లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
ముంపులోనే ఓరుగల్లు ... చరిత్రలోనే మొదటిసారి .. వేలాది ప్రజల కన్నీటి వరద
వరద ప్రభావిత ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటన ... బాధితులతో మాట్లాడిన మంత్రి
బస్సు ద్వారా ప్రయాణించి హన్మకొండ నయీమ్ నగర్ నాలాను పరిశీలించారు . తీవ్ర వరద ప్రభావానికి గురైన సమ్మయ్య నగర్ లోని ప్రజలతో మాట్లాడారు. అక్కడ బాధితులకు వరదలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని భరోసా కల్పించారు. డ్రైనేజీ నిర్మాణానికి పది కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఆక్రమణలకు గురైన నాలాలలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎక్కడా ప్రాణనష్టం జరగలేదు ,ఇది హర్షించాల్సిన విషయమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
నగరంలోని పలు ముంపు ప్రాంతాలలో పరిశీలన .. నాలాల ఆక్రమణలపై ఫిర్యాదుల వెల్లువ
బస్సు నుండే ఈదుల వాగు ప్రవాహాన్ని పరిశీలించిన కేటీఆర్ 100 ఫీట్ రోడ్డు, పెద్దమ్మగడ్డ ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద భద్రకాళి వాగు బ్రిడ్జిని పరిశీలించారు. అక్రమ నిర్మాణాల తో పాటుగా చెట్లను తొలగించాలని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పోతన నగర్ వద్ద భద్రకాళీ వరద ను పరిశీలించారు. హంటర్ రోడ్ లోని సంతోషి మాత గుడి వద్ద ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటించారు. బొంది వాగును పరిశీలించారు . భద్రకాళీ చెరువుకు వరద ఎక్కడ నుండి ఎంత వస్తుందో నివేదిక ఇవ్వాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.
భద్రకాళీ చెరువు వరద విషయంలో నివేదిక కోరిన మంత్రి
భద్రకాళి చెరువుకు ఒకటే తూము ఉండటంవల్ల వరద నీరు ఎక్కువగా నిలిచిపోయిందని, అదనపు తూము లను ఏర్పాటు చేస్తే వరదనీరు నిలిచిపోదని స్థానికులు కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు.ఈ విషయంలో కేటీఆర్ 100% శాశ్వత పరిష్కారం చేస్తామని, అందుకోసం అధికార యంత్రాంగం నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. వరంగల్లోని అండర్ బ్రిడ్జ్ ప్రాంతాన్ని మంత్రి కేటీఆర్ సందర్శించి, అక్కడ వరద ప్రభావాన్ని తెలుసుకున్నారు. ఎంజీఎం, కె ఎం సి, ములుగు రోడ్డులలో వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రి కేటీఆర్ పర్యటించారు.
నాలాల కబ్జాలపై మంత్రి సీరియస్ .. తొలగింపుకు ఆదేశాలు
వరంగల్ మహా నగరం వరద ముంపుకు గురి కావడానికి నాలాల కబ్జాలే ప్రధాన కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ నాలాల కబ్జాల విషయంలో మంత్రి కేటీఆర్ చాలా సీరియస్ గా స్పందించారు . నాలాల కబ్జాలను తొలగించాలని ఆదేశాలిచ్చారు. మంత్రి కేటీఆర్ వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటెల రాజేందర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ , వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి తదితరులు ముంపు ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు.