శోభాయామానంగా కాళేశ్వరం.. 3 రోజుల పాటు మహా శివరాత్రి జాతర
వరంగల్ : ప్రముఖ శైవక్షేత్రం కాళేశ్వరంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ఈ దివ్యక్షేత్రానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. మూడు రోజుల పాటు కనులపండువగా సాగే ఉత్సవాలకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 10 గంటలకు దీపారాధన, గణపతిపూజ, స్వస్తి పుణ్యహవచనం నిర్వహించనున్నారు. 11 గంటలకు మండప దేవతారాధనముతో పాటు సాయంత్రం 4 గంటలకు అగ్ని ప్రతిష్ఠ, రుద్రహవనం, రాత్రి 8 గంటలకు ఊరేగింపు, ఎదుర్కోలు సేవలు జరపనున్నారు.
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని కాళేశ్వరం శైవక్షేత్రం కొత్త శోభ సంతరించుకుంది. శివ పార్వతుల కల్యాణ మహోత్సవం తిలకించడానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ ప్రాంతాల నుంచి దాదాపు 5 లక్షల మంది భక్తులు వస్తారనేది ఓ అంచనా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ శివరాత్రి ఉత్సవాల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు.