మినీ మేడారంలో కరోనా.. 10 లక్షల మంది వరకు హాజరు, సిబ్బందికి పాజిటివ్..?
మినీ మేడారం జాతరలో కరోనా కలకలం రేపింది. దేవాదాయ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులకు వైరస్ సోకిందని తెలుస్తోంది. దీంతో భక్తులు ఆదోళనలకు గురవుతున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే వైరస్ వ్యాపించిందని అంటున్నారు. సిబ్బందికి వైరస్ సోకిందా లేదా అనే అంశాన్ని మేడారం దేవాలయ ఉన్నతాధికారులు మాత్రం ధృవీకరించడం లేదు.
కరోనా కేసులు నమోదవడంతో ఆలయ సిబ్బంది, భక్తుల్లో భయం నెలకొంది. టెస్టులు చేసిన తర్వాత ఆలయ అధికారులు ధృవీకరించే అవకాశం ఉంది. మేడారం మినీ జాతర ఈ నెల 24వ తేదీన ప్రారంభమై.. నేడు ముగియనుంది.పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. ఇక్కడకు వచ్చే వారు కనీస ముందు జాగ్రత్తలు పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
కరోనాకు సంబంధించి జాగ్రత్తలు తీసుకున్న తర్వాత జాతరను నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రణాళిక లోపం వల్ల సిబ్బందికి కరోనా వైరస్ వచ్చి ఉంటుందని అంటున్నారు. బుధవారం మంత్రి సత్యవతి రాథోడ్ గట్టమ్మ వద్ద అమ్మవారిని దర్శించుకున్నారు.
మేడారంలో సమ్మక్క సారలమ్మలకు చీరె పెట్టి పూజలు చేశారు. జాతరకు వచ్చే భక్తులు కోవిడ్ జాగ్రత్తలు పాటించి, అమ్మవార్ల దర్శనాలు చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఆలయ సిబ్బందికి వైరస్ వచ్చిందనే ప్రచారం మాత్రం భక్తులను భయాందోళన కలిగిస్తోంది.