ఈ పైసలేమైనా మీ అయ్య సొమ్మా ? గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ మీటింగ్ లో బల్దియా ఇంజనీర్లపై చల్లా ఫైర్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. స్వపక్ష నాయకులే, విపక్ష నాయకుల్లాగా అభివృద్ధి పనులపై నిలదీత కార్యక్రమాలు కొనసాగించారు. ఆసక్తికరంగా సాగిన కౌన్సిల్ సమావేశంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బల్దియా ఇంజనీర్ల పై భగ్గుమన్నారు.
టెండర్లు పూర్తయ్యి ఏళ్ళు గడుస్తున్నా మొదలు కాని పనులపై ఆగ్రహం
పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 32 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. ఈ నిధులతో పాటు సీఎం ప్రత్యేక నిధుల ద్వారా కూడా పనులు జరుగుతున్నాయని, ఏయే పనులు పూర్తి చేశారు. మిగతా పనులు ఏ స్థాయిలో ఉన్నాయో బల్దియా అధికారులు వివరించాలి అంటూ ప్రశ్నించారు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. టెండర్లు పూర్తయి రెండు ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటివరకు చాలా చోట్ల పనులు ప్రారంభం కాలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని, ఎంతమంది కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
బల్దియా ఇంజనీర్లపై చల్లా ఆగ్రహం ... మీ అయ్యా సొమ్మా ? అంటూ ఫైర్
ఇప్పుడు గ్రేటర్ వరంగల్ లో కౌన్సిల్ సమావేశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏ వివరాలు అడిగినా సరైన సమాధానం చెప్పకుండా ప్రవర్తించడంపై నిప్పులు చెరిగిన ఆయన ఈ పైసలు ఏమైనా మీ అయ్య సొమ్మా అంటూ బల్దియా ఇంజనీర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 డివిజన్ లలో వివిధ అభివృద్ధి పనుల కోసం సుమారు 30 కోట్ల నిధులు కేటాయించామని మేయర్ గుండా ప్రకాష్ రావు చెప్పడంతో ఎమ్మెల్యే చల్లా తోపాటు పలువురు టిఆర్ఎస్ కార్పొరేటర్లు నిధులు కేటాయించడం సరే.. డివిజన్ లలో పనులేవీ అంటూ నిలదీశారు. అరగంటపాటు అభివృద్ధి పనులపై రసవత్తరమైన చర్చ జరిగింది
ఇంజనీర్ల అసమర్ధత వల్లే అభివృద్ధి లేదని మండిపాటు
ఇంజనీర్ల అసమర్ధతతో పనులు కావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో 900 కోట్లు కేటాయించినా వాడుకోవడంలో బల్దియా యంత్రాంగం విఫలమైందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో చెయ్యలేని అభివృద్ధి ఆర్నెల్లలో చేస్తారా అని ఎమ్మెల్యేతో పాటు పలువురు టీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం కౌన్సిల్ సమావేశం వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. స్వపక్షమే, విపక్షమై విమర్శలు గుప్పిస్తూ, నిలదీతల పర్వం కొనసాగిన నేపథ్యంలో కౌన్సిల్ సమావేశం గరం గరంగా సాగింది.
అజెండా అంశాలపై చర్చ .. వరద పరిహారంగా 500కోట్ల మంజూరుకు మంత్రి కేటీఆర్కు వినతి
అజెండాలోని 30 అంశాలతో పాటు టేబుల్ అజెండాగా 32 అంశాలను తీసుకుని చర్చించి ఆమోదముద్ర వేశారు.ఇటీవల కురిసిన వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, డ్రెయినేజీల మరమ్మతు కోసం 45 డివిజన్లకు రూ.30కోట్ల జనరల్ ఫండ్ నిధుల వినియోగానికి ఆమోద ముద్ర వేశారు . వరద నష్ట పరిహారం క్రింద రూ. 500కోట్ల మంజూరుకు మంత్రి కేటీఆర్కు నివేదించాలనే తీర్మానాన్ని కూడా కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. ప్రతీ డివిజన్కు రూ.5లక్షలు నామినేషన్ కింద నిధులు మంజూరు చేస్తున్నట్లు మేయర్ గుండా ప్రకాష్ రావు వెల్లడించారు.