యంత్రాంగాన్ని కదిలించిన వృద్ధుల "లంచం కోసం బిచ్చం".. ఎమ్మార్వో సస్పెన్షన్
భూపాలపల్లి : లంచం ఇవ్వడానికి వృద్ధ దంపతులు భిక్షమెత్తుకుంటున్నారనే వార్త ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఆ ఘటన వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. లంచం అడిగిన ఇద్దరిపై వేటు వేశారు జిల్లా కలెక్టర్.
ఆజం నగర్ కు చెందిన మాంత బసవయ్య, లక్ష్మి అనే వృద్ధ దంపతులు, తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ బుక్ ల కోసం రెండేళ్లుగా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఆ క్రమంలో లంచం ఇస్తే తప్ప పని కాదని వీఆర్వో తో పాటు తహసీల్దార్ కూడా చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో భిక్షాటనకు దిగారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో వృద్ధ దంపతులు భిక్షాటన చేస్తున్న దృశ్యం మీడియా కంటపడటంతో విషయం వెలుగుచూసింది. ఈ వార్తను వన్ ఇండియా తెలుగు వెబ్ సైట్తో పాటు మీడియా మొత్తం పబ్లిష్ చేసింది. ఆ విషయం తెలంగాణ వ్యాప్తంగా వైరల్ కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.
లంచం కోసం వృద్ధ దంపతులు భిక్షాటన చేస్తున్నారనే వార్తతో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్పందించారు. సమస్య పరిష్కారించాలంటూ భూపాలపల్లి ఆర్డీవోను ఆదేశించారు. దీంతో తన కార్యాలయానికి పిలిపించి 4 ఎకరాల 10 గుంటలకు సంబంధించిన పట్టాదారు పాస్ బుక్ ఆ వృద్ధ దంపతులకు అందించారు ఆర్డీవో వెంకటాచారి. మిగతా 5 ఎకరాల 7 గుంటలకు సంబంధించిన భూమి వివాదంలో ఉందని, పూర్తిగా పరిశీలించిన తర్వాత దానికి సంబంధించిన పట్టాదారు పాస్ బుక్ అందిస్తామని తెలిపారు. అదలావుంటే లంచం పేరుతో వృద్ధ దంపతులను పీడించిన వీఆర్వో శ్రవణ్, తహసీల్దార్ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు కలెక్టర్.