9 నెలల చిన్నారిని రేప్ చేసి చంపిన కామాంధుడిని ఉరి తియ్యాలి.. వరంగల్ లో ఆందోళన
ఓరుగల్లులో మానవ మృగం రెచ్చిపోయింది. ఓ తొమ్మిది నెలల చిన్నారి పై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చిన్నారి ప్రాణం తీసిన ఘటన సభ్య సమాజాన్ని షాక్ కు గురి చేసింది. ఆ కామాంధుడిని ఉరి తీసే వరకు పాప మృతదేహాన్ని ఖననం చెయ్యమని తల్లిదండ్రులు , బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఇక మహిళా సంఘాలు కామంతో కళ్ళు మూసుకుపోయి చిన్నారి జీవితం చిద్రం చేసిన వాడిని ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తున్నారు.
వరంగల్ లో తొమ్మిది నెలల పసిపాపపై పాశవికం .. రేప్ చేసి చంపేసిన కామాంధుడు
ఆ మృగాడిని ఉరి తీయాల్సిందే .. అప్పటిదాకా పాప మృతదేహం ఖననం చెయ్యం
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని టైలర్ స్ట్రీట్ లోని పాలచందాలో 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై ఓరుగల్లులో ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. కామాంధుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి . మరొకరు ఇలా చేయకుండా ఉండాలంటే ఆ కామాంధుడికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు . చిన్నారి మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మార్చురీ వద్ద కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పాప మృతికి కారణమైన వాడిని ఉరి తీసేవరకు పాప మృతదేహాన్ని ఖననం చెయ్యమని అంటున్నారు.
రెండు అత్యాచార కేసులున్న ప్రవీణ్ .. పోలీసుల అదుపులో నిందితుడు
జక్కోజీ జగన్, రచన దంపతుల కుమార్తె శ్రిత 9 నెలల చిన్నారి. డాబాపై నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు ప్రవీణ్ అనే కామాంధుడు. అనుమానం వచ్చిన తల్లి రచన అక్కడకు వెళ్లి చూసేసరికి చిన్నారి విగజీవిగా పడి ఉండడంతో షాక్కు గురైంది. చిన్నారిని పాశవికంగా అత్యాచారం చేసి చంపేశాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడు ప్రవీణ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక చిన్నారి మీద అత్యాచారం చేసిన ప్రవీణ్ మీద గతంలో రెండు అత్యాచారాల కేసులున్నాయని తెలుస్తుంది.
నడిబజార్లో ఉరి తీయాలని డిమాండ్ .. మహిళా సంఘాల ఆందోళన
గతంలో మహిళలను కూడా ప్రవీణ్ లైంగిక వేధింపులకు గురి చేశాడని స్థానికులు చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండాలంటే నడి బజార్లో అతడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. శ్రిత హత్యకు నిరసనగా మహిళలు, యువకులు అశోక జంక్షన్లో మానవహారం నిర్వహించి ఆందోళనకు దిగారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని, లేదంటే తమకు అప్పగించండి అంటూ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.