వరంగల్ నిట్ లో మళ్ళీ జడలు విప్పుతున్న ర్యాగింగ్ భూతం .. ఐదుగురిపై వేటు
ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుతోంది . కళాశాలల్లో, యూనివర్సిటీల్లో ర్యాగింగ్ నిరోధానికి ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా ర్యాగింగ్ కళాశాలల్లో జరుగుతూనే ఉంది. తాజాగా వరంగల్ నిట్లో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతోంది.
నిట్ లో మళ్ళీ ర్యాగింగ్ కలకలం
వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ నిట్ క్యాంపస్లో బిటెక్ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారని, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని జూనియర్ స్టూడెంట్స్ కంప్లయింట్ చేశారు. గతంలో కూడా నిట్ లో ర్యాగింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండు నెలల క్రితం ర్యాగింగ్ విషయంలో 9 మందిని సస్పెండ్ చేశారు. తాజాగా జరిగిన ఘటనలో ఐదుగురిని సస్పెండ్ చేశారు.
ఘటనపై విచారణ కమిటీ .. పోలీసులకు ఫిర్యాదు చేసిన నిట్ అధికారులు
నిట్ వరంగల్ లో బీ టెక్ చదువుతున్న జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు వేధింపులకు గురి చేస్తున్నారు. దాంతో ఇబ్బంది పడిన జూనియర్లు సీనియర్ల ర్యాగింగ్ పై నిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు విచారణ కమిటీ వేసి ర్యాగింగ్ జరిగింది అని నిర్దారించుకున్నారు. కాజీపేట పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. పది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఎక్కడా బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
ర్యాగింగ్ కు పాల్పడిన ఐదుగురిపై వేటు
ఇక ర్యాగింగ్ వ్యవహారంలో విచారణలో BTech మూడో సంవత్సరం చదువుతున్న ముగ్గురు, లాస్ట్ సంవత్సరం చదువుతున్న ఇద్దరు కారణమని తేలింది. వీరిపై వేటు వేశారు అధికారులు. వారిని విద్యాసంస్థ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
చేసిన తప్పుకు పశ్చాత్తాప పడక కోర్టుకెళ్ళిన విద్యార్థులు .. పిటీషన్ డిస్మిస్ చేసిన కోర్టు
తాము చేసిన తప్పును దిద్దుకోకపోగా , కనీసం పశ్చాత్తాపం కూడా లేని ఆ విద్యార్థులు నిట్ అధికారుల సస్పన్షన్ను సవాల్ చేస్తూ సీనియర్లు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది. అయితే వారి పిటిషన్ కోర్టు డిస్మస్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనపై మాట్లాడిన నిట్ అధికారులు మాత్రం ర్యాగింగ్ కు పాల్పడిన వారిని సస్పెండ్ చేశామని మాత్రమే చెప్తున్నారు.