ఒక పాప .. ఇద్దరు తల్లులు.. వరంగల్ లో బిడ్డ కోసం ఇద్దరు తల్లుల పోరాటం
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఒక బిడ్డ కోసం ఇద్దరు తల్లుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ బిడ్డ తమదంటే.. తమ దంటున్నారు ఇద్దరు తల్లులు. పేగు తెంచుకుని పుట్టిందని ఓ తల్లి, దత్తత తీసుకున్నానని మరో తల్లి చెబుతున్నారు. పుట్టి పట్టుమని పది రోజులైనా పాప కోసం ఇద్దరు తల్లుల మధ్య పోరాటం జరుగుతుంది. ఎవరిని కదిలించినా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పుడు ఆ బిడ్డ కోసం ఇద్దరు తల్లుల మధ్య వివాదం మొదలైంది.
ఒక పాప కోసం ఇద్దరు తల్లుల పోరాటం .. కన్నానని ఒకరు, దత్తత తీసుకున్నానని ఒకరు గొడవ
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది . మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటకు చెందిన కోటపాటి సోని, దినకర్లకు పాప జన్మించింది . సీకేఎం ఆస్పత్రిలో డెలివరీ అయిన సోనీ కి పుట్టిన నవజాత శిశువుకు ఆరోగ్యం బాగా లేకపోవటంతో ఎంజీఎంలోని పిల్లల వార్డుకు తీసుకెళ్ళారు. అయితే ఎంజీఎంలో పక్క బెడ్ లో ఉన్న అలీషా బేగం అనే మరో తల్లి వీరి వద్ద నుంచి దత్తత తీసుకున్నట్టు చెబుతోంది. ఆస్పత్రి రికార్డ్ లో అఫ్రీన్ గా పేరు నమోదు చేయించారు. తనకు ఇద్దరు పిల్లలు మగపిల్లలని, ఆడపిల్ల ఇస్తే పెంచుకుంటానని అడిగానని ఆ మహిళ చెప్తోంది. ఇక ఎంజీఎం ఆస్పత్రి రికార్డులలో పసిపాప తల్లిదండ్రులుగా అలిషాబేగం దంపతులు పేర్లు నమోదయ్యాయి. దీంతో ఈ ఇద్దరు తల్లుల వివాదం తీవ్రమైంది.
పాప అమ్మమ్మకు, ఆలీషా బేగం కు మధ్య పాప కొనుగోలు ఒప్పందం జరిగిందని అనుమానిస్తున్న పోలీసులు
పాప తమకంటే తమకు కావాలని వారి మధ్య వివాదం కొనసాగుతుంది. అయితే పాపను అమ్మకానికి పెట్టారనే కోణంలో కూడా ఈ ఘటనను గమనిస్తున్న వారు భావిస్తున్నారు. ఇక పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగింది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న వారు సోని తల్లి సుశీలకు, ఆలీషా బేగం కు మధ్య ఆర్ధిక లావాదేవీల నేపధ్యంలోనే పాపను వారికి ఇచ్చినట్టు అనుమానిస్తున్నారు. సీకేఎం ఆస్పత్రిలో సోని పాపగా, ఎంజీఎంలో అలీపాష పాపగా రికార్డు కావడం మొత్తం గందరగోళానికి తావిస్తోంది.
కన్న తల్లికే పాపను ఇచ్చే అవకాశం.. విచారణ జరుపుతున్న అధికారులు
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దీంతో పోలీసులు రెండు ఆస్పత్రుల్లోని రికార్డులను సరిపోల్చుతున్నారు. పాప జన్మించిన సీకేఎం ఆస్పత్రి రికార్డులు సోని, దివాకర్ ల పాపగా చెబుతున్నాయి. కానీ ఎంజీఎం ఆస్పత్రి ఇన్ పేషెంట్ వార్డులో మాత్రం అలీపాషకు చెందిన పాపగా రికార్డు అయింది. వేర్వేరు ఆస్పత్రుల్లో వేర్వేరు పేర్లు నమోదు కావడంతో పాప ఎవరనేది తేల్చాలంటే డీఎన్ ఏ టెస్టు అనివార్యమైంది. ఎవరైతే జన్మనిచ్చిన తల్లి అయ్యి ఉంటారో వారికే ఈ పాపను ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఆ దిశగా విచారణ చేస్తున్నారు.