రైల్వే మహిళా టికెట్ ఇన్స్పెక్టర్ పై దాడి.. ట్రైన్ నుంచి..!
వరంగల్ : పాట్నా ఎక్స్ప్రెస్లో ప్రయాణీకులు దారి తప్పారు. మహిళా టికెట్ ఇన్స్పెక్టర్ పై అనుచితంగా ప్రవర్తించారు. రైల్లో నుంచి ఆమెను తోసివేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కాజీపేట జంక్షన్ లో జరిగింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ధానాపూర్ వెళ్లాళ్సిన పాట్నా ఎక్స్ప్రెస్ లో.. స్లీపర్ క్లాస్ 1 బోగిలో టికెట్లు తనిఖీ చేశారు ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్ నీలిమ. ఆ సమయంలో కొందరు ప్రయాణీకులు జనరల్ టికెట్ తీసుకుని స్లీపర్ క్లాస్ కోచ్ లో కనిపించారు. దీంతో నీలిమ వారిని జరిమానా కట్టాలని కోరారు. ఆ కోచ్ లో వీపరీతమైన రద్దీ ఉండటంతో ఆమె మాట ఎవరూ పట్టించుకోలేదు. పైగా నీలిమను బయటకు తోసేశారు.
ప్రయాణీకులు తనను తోసివేయడంతో ప్లాట్ఫాంపై పడిపోయారు నీలిమ. ఆమె కాలు ప్లాట్ఫాం, ట్రైన్ కు మధ్యన ఉండే గ్యాప్ లో ఇరుక్కుపోయింది. పరిస్థితి గమనించిన కొందరు ప్రయాణీకులు ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. విషయం తెలిసి హుటాహుటిన రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. నీలిమను రైల్వే ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పాట్నా ఎక్స్ప్రెస్ కొన్ని నిమిషాల పాటు కాజీపేటలో ఆగడంతో కాస్తా ఆలస్యంగా బయలుదేరింది.