కారులో 5 కోట్లు.. సీటు కింద కరెన్సీ కట్టలు.. చెక్ పెట్టిన పోలీసులు
జనగామ : ఎన్నికల వేళ కరెన్సీ కట్టలు చేతులు మారుతున్నాయి. లెక్కలు లేని కోట్ల రూపాయల ధన ప్రవాహం అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెడుతున్నారు కొందరు. ఈక్రమంలో జనగామ జిల్లాలో 5 కోట్ల రూపాయలు పట్టుబడటం సచలనంగా మారింది. పెంబర్తి చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేపడుతుండగా ఈ నగదు గుట్టురట్టైంది. అర్ధరాత్రి 1.30 - 2.00 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళుతున్న ఓ స్విఫ్ట్ కారులో ఇంత పెద్దమొత్తంలో నగదు పట్టుబడింది.
కారు లోపల, ఢిక్కీలో పోలీసులకు ఏమీ దొరకలేదు. అనుమానం వచ్చి వెనుక సీటు కింద చెక్ చేయగా కరెన్సీ కట్టలు దర్శనమిచ్చాయి. అయితే ఈ నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు గానీ, సరైన పత్రాలు గానీ లభించలేదు. దీంతో ఈ కరెన్సీని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎన్నికల అధికారుల సమక్షంలో లెక్కించగా 5 కోట్ల రూపాయలు ఉన్నట్లు తేలింది.