ప్రియుడే హంతకుడు...!! శవానికి కొత్తబట్టలు... వరంగల్ యువతి హత్య మిస్టరీ
వరంగల్ నగరంలో అత్యాచారం, హత్యకు గురైన యువతి కేసులో పోలీసులు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. జిల్లాకు చెందిన యువకుడితో... హత్యకు గురైన మానస ఆరునెలలుగా ప్రేమాయణం కొనసాగిస్తుందని పోలీసులు గుర్తించారు. తన పుట్టిన రోజు కావడంతో గుడికి వెళ్లి వస్తానని చెప్పిన యువతి ప్రియుడితో కలిసి వెళ్లిందని పోలీసులు వివరించారు. ఈ నేపథ్యంలోనే ప్రియుడు నమ్మించి ఆమెపై అత్యాచారం చేసి అనంతరం హత్యకు గురిచేసినట్టుగా పోలీసులు వెల్లడించారు.
కలకలం రేపిన యువతి హత్య
వరంగల్ నగరం హంటర్ రోడ్డులోని దీన్దయాల్ నగర్లో నివాసం ఉండే మానస అనే యువతి అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. పుట్టిన రోజు సంధర్భంగా బుధవారం నగరంలోని భద్రకాళీ దేవాలయానికి వెళ్లిన యువతి తిరిగి రాలేదు. దీంతో మానస తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 24గంటల్లోనే హత్యకు కారణమైన మానస ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ప్రియుడే హంతకుడు
జిల్లాలోని స్టేషన్ఘన్పూర్ మండలం నమిలికొండ గ్రామానికి చెందిన సాయికుమార్ గౌడ్ , మానసల మధ్య గత ఆరునెలలుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. గుడికి వెళ్లొస్తానని చెప్పిన మానస, ప్రియుడు సాయికుమార్తో దగ్గరలోని రాంపూర్ ప్రాంతానికి వెళ్లిందని పోలీసులు తెలిపారు. దీంతో మానసను నమ్మించి, అత్యాచారం చేసి, దారుణంగా హత్యచేశారని పోలీసులు భావిస్తున్నారు. హత్యానంతరం మానస మృతదేహాన్ని నగరంలోని హంటర్రోడ్డు ప్రాంతంలో వదిలివేసి వెళ్లాడని తెలుస్తోంది.
ఆరునెలలుగా ప్రేమాయణం
కాగా హత్యకు గురైన మానస ఇంటర్మీడియట్ చదువుతూనే నగరంలోని తండ్రి నిర్వహించే కూరగాయల వ్యాపారానికి సహాయం చేస్తోంది. కాగా హంతకుడు సాయికుమార్ గౌడ్ హన్మకొండ హంటర్ రోడ్డులోని ఓ కాలేజీలో డిగ్రి చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈనేపథ్యంలోనే కాలేజీ దారిలో కూరగాయల వ్యాపారం నిర్వహించే మానసతో ఆరు నెలల క్రితం పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని పోలీసులు తెలిపారు.
కారులో అత్యాచారం
ఇక మానస పుట్టిన రోజు కావడంతో తనను కలవమని సాయికుమార్ చెప్పాడు. దీంతో గుడికి వెళ్లి వస్తానని చెప్పిన మానస ఖాజిపేట ప్రాంతానికి చేరుకుంది. అప్పటికే తన కారులో వేచి ఉన్న సాయికుమార్తో కలిసి వెళ్లిపోయింది. అయితే ఆమెను కారులో తీసుకుని పోయిన సాయికుమార్ పెండ్యాల సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లాడు. కారును నిలిపి దాంట్లోనే అత్యచారానికి పాల్పడ్డాడు. అయితే అత్యాచారం సమయంలో మానస చనిపోయినట్టుగా పోలీసులు వివరించారు.
సినిఫక్కిలో శవాన్ని మాయం చేయాలని ప్లాన్
మానస మృతి చెందడంతో బయపడి పోయిన సాయికుమార్ అది తనపై రాకుండా ఉండేందుకు స్నేహితుల సహాయం కోరాడు. కాని మానస శవాన్ని చూసిన స్నేహితులు అందుకు అంగీకరించ లేదు. వెంటనే అక్కడి నుండి తిరిగి వెళ్లి పోయారు. దీంతో చేసేదేమి లేక ఆందోళన చెందిన నిందితుడు ఒక్కడే మానస శవాన్ని కారులో ఎక్కించుకుని బయలుదేరాడు. అలా చికటీ పడేవరకు కారులో నగరశివారులో ప్రయాణం చేశాడు.
శవానికి కొత్త బట్టలు
అనంతరం మానస హత్యను సహజంగా చిత్రికరించేందుకు సాయికుమార్ సినిఫక్కిలో ప్రయత్నం చేశాడు. తన కాలేజీ సమీపంలోని బట్టల షాపులోఆమెకు డ్రెస్ కోనుగోలు చేసి, తిరిగి కారులో హంటర్ రోడ్లోని న్యూశాయంపేట రైల్వేట్రాక్ వద్దకు చేరుకుని ... రక్తపు మరకల బట్టలను తొలగించి కొత్త బట్టలను మృతదేహానికి వేశాడు. ఇక అక్కడి నుండి మానసను ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో పడేసి అనంతరం అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు.