కోర్టు మొట్టికాయలు పడితే తప్ప.. న్యాయస్థానం మెట్లెక్కని రేణుకాచౌదరి
హైదరాబాద్ : మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరి వ్యవహారశైలిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆమె ఖమ్మం న్యాయస్థానానికి వచ్చారు. 2014 ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని డబ్బులు దండుకున్నారని బాధితులు వాపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించినా .. ధిక్కరించారు రేణుకాచౌదరి. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మాజీ ఎంపీ రేణుకాచౌదరి .. ఇవాళ కోర్టుకు హాజరయ్యారు.
ఇదీ నేపథ్యం
2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చట్టసభలకు పోటీ చేసేందుకు నేతలు ఆసక్తి చూపించేవారు. ఇందులో కొందరు నేతలు కల్పించుకొని .. టికెట్ ఇప్పిస్తామని మోసం చేశారు. అలా రాంజీనాయక్కు టికెట్ ఇప్పిస్తానని వంచించారు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరీ.
రూ.కోటి 40 లక్షలు వసూల్
ఎలాగూ టికెట్ వస్తోందనే ధీమాతో రేణుకా అడిగిన రూ.కోటి 40 లక్షల నగదును కూడా అందజేశాడు రాంజీనాయక్. కానీ టికెట్ మాత్రం రాలేదు. దీంతో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. డబ్బులు ఇవ్వమని అడిగితే గెంటివేశారు. దీంతో ఆయన ఆవేదనకు గురై చనిపోయారు. తర్వాత అతని భార్య ప్రభావతి మీడియా ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.
మోసం.. వంచన
టికెట్ పేరుతో తమను రేణుకాచౌదరి మోసం చేశారని ఖమ్మ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రభావతి. టికెట్ రాలేదని మనస్థాపంతోనే తన భర్త చనిపోయాడని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు .. విచారణకు రావాలని రేణుకాచౌదరికి ఆదేశాలు జారీచేసింది. కానీ ఆమె విచారణకు హాజరుకాలేదు. దీంతో రేణుకాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సరికాదని తీరు మార్చుకోవాలని స్పష్టంచేసింది.
కోర్టు మొట్టికాయలతో
రాంజీనాయక్ భార్య వేసిన పిటిషన్ విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు మొట్టికాయలు వేయడంతో .. రేణుకాచౌదరి దిగొచ్చారు. కేసు విచారణకు సంబంధించి ఇవాళ ఖమ్మం కోర్టుకు హాజరయ్యారు. జరిగిన ఘటన గురించి రేణుకాచౌదరి తరఫు లాయర్ వివరించారు. పిటిషన్లో రేణుకా వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం .. తదుపరి విచారణను వచ్చేనెల 17వ తేదీకి వాయిదావేసింది.