ఫూటుగా తాగాడు.. బస్సు నడిపాడు.. ప్రయాణీకులు అలర్ట్ గా లేకుంటే ఏమైఉండేదో?
స్టేషన్ఘన్పూర్ : అతను ప్రభుత్వోద్యోగి. ప్రజలకు జవాబుదారీ. అంతేకాదు జనాల ప్రాణాలు ఆయన అరచేతిలో ఉంటాయి. ఇంత ఇంట్రడక్షన్ ఉన్న ఆ పెద్దమనిషికి ఎంత బాధ్యత ఉండాలి. కానీ ఆయన మాత్రం దారి తప్పాడు. ఫూటుగా మద్యం తాగి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాడు. ఇదంతా ఓ ఆర్టీసీ డ్రైవర్ నిర్వాకం.
వరంగల్ - 2 డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న పాపయ్య ఆదివారం రాత్రి 8గంటలకు హన్మకొండ నుంచి రాజధాని బస్సు నడుపుతున్నారు. దాదాపు 50 మంది ప్రయాణీకులు అందులో ఉన్నారు. అయితే మడికొండ సమీపంలో బస్సు కుదుపులకు గురయింది. ఏంటని ఆరా తీస్తే లైట్లు సరిగా లేవని, స్పీడ్ బ్రేకర్ కనిపించలేదని డ్రైవర్ సమాధానం ఇచ్చాడంట. ఇక అక్కడినుంచి ఆయన తీరుపై అనుమానం కలిగి స్టేషన్ఘన్పూర్ లో బస్సును నిలిపివేయించారు ప్రయాణీకులు.
డ్రైవర్ ను నిలదీసే క్రమంలో ఆయన మద్యం తాగినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ రాజిరెడ్డి సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. బ్రీత్ అనలైజర్ తో పరీక్షించగా 156 పాయింట్లు ఆల్కహాల్ తీసుకున్నట్లు తేలింది. దీంతో మద్యం తాగి బస్సు నడిపినందుకు కేసు నమోదు చేశారు. ప్రయాణీకులు అప్రమత్తమయ్యారు కాబట్టి సరిపోయింది లేదంటే ఎలాంటి ప్రమాదం జరిగి ఉండేదో ఊహించడం కష్టం.