వరంగల్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తం .. పలువురికి గాయాలు
తెలంగాణ ఆర్టిసిని ప్రభుత్వ శాఖలో విలీనం చేయాలని కోరుతూ, అలాగే పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. కార్మికుల సమ్మె ను అణిచివేయడం కోసం ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఐదో తేదీ సాయంత్రంలోగా ఎవరైతే విధులకు హాజరు అవుతారో వారిని మాత్రమే ఆర్టిసి ఉద్యోగులుగా పరిగణించబడతారు అని ప్రకటించిన ప్రభుత్వం, తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని 48,600మంది ఉద్యోగులను తొలగించినట్టు అని ప్రకటన చేసింది.
ఆర్టీసీ సమ్మె నేడు తేలిపోతుందా: ప్రభుత్వం కార్మిక సంఘాల చూపు అటువైపే: ఆ తరువాతనే...!
ఇక అంతే కాదు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సైతం చేస్తున్న ప్రభుత్వం త్వరితగతిన ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ తొలగిస్తామని బెదిరింపులకు గురి చేసి, తమను తొలగిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం పై న్యాయ పోరాటం చేస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీసీ కార్మికులు తమ గోడును న్యాయస్థానానికి విన్నవించుకున్నారు.
ఇక మరోవైపు నేడు ఆరో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. వరంగల్ నగరంలో ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఇక వీరి ర్యాలీలో ఉద్రిక్తత నెలకొంది. గురువారం ఉదయం అదాలత్ సెంటర్లో అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అది క్రమంగా తోపులాటకు దారితీసింది. మహిళా కార్మికులకు పోలీసులు నెట్టివేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు.