సమ్మక్క సారాలమ్మ గద్దెలు మూసివేత.. ఎందుకంటే..
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో గల మేడారం సమ్మక్క-సారలమ్మల దర్శనాలను నిలిపివేస్తున్నట్టు దేవాదాయ శాఖ తెలిపింది. సోమవారం నుంచి భక్తులను అనుమతించబోమని ఈవో రాజేంద్ర తెలిపారు. ఆయన గద్దెల పరిసరాల్లో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. మినీ మేడారం సిబ్బందికి కరోనా వైరస్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు జరిగిన మినీ జాతరలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించిన ఇద్దరు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లకు కరోనా నిర్ధారణ కావడంతో పూజారుల సంఘం వినతి మేరకు 21 రోజులపాటు వనదేవతల గద్దెల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి భక్తులు మేడారం రావొద్దని సూచించారు. ఈ విషయాన్ని దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు గమనించాలని సూచించారు.
మినీ మేడారం జాతరలో కరోనా కలకలం రేపింది. దేవాదాయ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులకు వైరస్ సోకింది. దీంతో భక్తులు ఆదోళనకు గురవుతున్నారు. ఇక్కడకు వచ్చే వారు కనీస ముందు జాగ్రత్తలు పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కరోనాకు సంబంధించి జాగ్రత్తలు తీసుకున్న తర్వాత జాతరను నిర్వహిస్తే బాగుండు అనే అభిప్రాయ పడుతున్నారు.
కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రణాళిక లోపం వల్ల సిబ్బందికి కరోనా వైరస్ వచ్చి ఉంటుందని అంటున్నారు. జాతరకు వచ్చే భక్తులు కోవిడ్ జాగ్రత్తలు పాటించి, అమ్మవార్ల దర్శనాలు చేసుకోవాలని అధికారులు అయితే సూచించారు. కానీఆలయ సిబ్బందికి వైరస్ వచ్చింది. ఇప్పటికే 10 లక్షల మంది భక్తులు దర్శించుకోవడంతో.. ఏం జరుగుతుందనే భయం వెంటాడుతోంది.