9 నెలల చిన్నారిపై లైంగిక దాడి, హత్య కేసులో సంచలన తీర్పు..నిందితుడికి ఉరి శిక్ష
ఓరుగల్లులో మానవ మృగం తొమ్మిది నెలల చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చిన్నారి ప్రాణం తీసిన ఘటన సభ్య సమాజాన్ని ఆవేదనకు గురి చేసింది . ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుని ఆ కామాంధుడిని ఉరి తియ్యాలని డిమాండ్ చేశారు . ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చెయ్యాలని కోరారు. చిన్నారిని రేప్ చేసి చంపేసిన నేరస్తుడికి ఉరి శిక్ష విధించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరి మనసుల్ని ఆవేదనకు గురి చేసిన ఈ కేసులో నేరస్తుడికి ఎలాంటి శిక్ష విధిస్తారు అన్న ఉత్కంఠ కు తెర పడింది. కోర్టు చిన్నారి కేసులో సంచలన తీర్పు వెలువరించింది. కామాంధుడు ప్రవీణ్ కు ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జ్ జయకుమార్ ఈ సంచలన తీర్పు వెలువరించారు.
కామాంధుడు ప్రవీణ్ కు ఉరి శిక్ష వేస్తూ వరంగల్ జిల్లా కోర్టు తీర్పు
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని టైలర్ స్ట్రీట్ లోని పాలచందాలో 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై ఓరుగల్లులో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి . కామాంధుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి . మరొకరు ఇలా చేయకుండా ఉండాలంటే ఆ కామాంధుడికి ఉరి శిక్ష వేయాలని అందరూ ముక్త కంఠంతో కోరారు . చిన్నారికి న్యాయం కావాలని నగరంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ప్రజా ప్రతినిధులను నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్ని చేసినా, ఎంత చేసినా బాలిక పాశవిక దాడిలో ప్రాణం పోగొట్టుకుంది కానీ 9 నెలల చిన్నారిని రేప్ చేసి చంపిన వాడికి మాత్రం ఇంకా శిక్ష పడలేదు అని ఇన్ని రోజులు అంతా ఆవేదన చెందారు. చివరికి నేడు ఉరిశిక్ష విధించి చిన్నారులపై జరిగే పాశవిక దాడులపై కఠినంగా స్పందిస్తామని తేల్చి చెప్పింది న్యాయస్థానం.
తీర్పు ఇవ్వనున్న నేపధ్యంలో భారీగా మోహరించిన పోలీసు బలగాలు
9 నెలల చిన్నారి శ్రీహిత పై జూన్ 18న అత్యాచారం, హత్య చేసిన మానవ మృగం ప్రవీణ్ పై జులై 11న ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు . నేడు తీర్పు వెలువడనున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరి మనస్సులో నాటి పాశవిక దాడి మెదలింది. నిందితుడికి కఠిన శిక్ష పడాలని కోరుకున్నారు. నేడు తీర్పు ఇవ్వనున్న నేపధ్యంలో కోర్టు వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడి వాంగ్మూలం నమోదు చేసిన న్యాయమూర్తి ఈ కేసులో తీర్పును 30 నిముషాల పాటు వాయిదా వేశారు. చివరకు నిందితుడికి ఉరి శిక్ష వేస్తూ తీర్పునిచ్చారు. దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అందరూ భావిస్తున్నారు. ఇంతటి కఠిన శిక్షలు అమలైతేనే మృగాళ్ళు భయపడే అవకాశం వుతుందని అందరూ భావిస్తున్నారు.
కామాంధుడు ప్రవీణ్ కు ఉరిశిక్ష పడటంపై సర్వత్రా హర్షాతిరేకాలు
9 నెలల చిన్నారి పై లైంగిక దాడి జరిగి హత్య చేసిన ఘటనతో ఆవేదన చెందిన భయం గుప్పిట్లో బతికిన మహిళా లోకం కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంది. మహిళా సంఘాలు ఇదే తరహా న్యాయం త్వరితగతిన ఇలాంటి ఘటనలలో అందించాలని కోరుతున్నారు. చిన్నారులను సైతం వదలని ప్రవీణ్ లాంటి కామాంధుడికి ప్రజలు డిమాండ్ చేసినట్టు ఈ తరహా శిక్ష విధించటంతో చిన్నారి ఆత్మ శాంతించిందనే భావన వ్యక్తం అవుతుంది. బిడ్డను పాశవిక ఘటనలో కోల్పోయిన చ్న్నారి తల్లిదండ్రులు కోర్టు ఇచ్చిన తీర్పుతో తమకు జరిగిన అన్యాయానికి కాస్త ఉపశమనం లభించిందని చెప్తున్నారు. మొత్తానికి దేశ వ్యాప్తంగా ఉలికిపాటుకు గురి చేసిన చిన్నారిపై జరిగిన పైశాచిక దాడిలో తుది తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.