ఆమె విక్రమార్కురాలు..! పోరాడింది.. పెళ్లి చేసుకుంది
ఇష్టమైనోడు కాదు పొమ్మంటే అధైర్యపడలేదు. నిన్నే కట్టుకుంటానంటూ మాటలు చెప్పి మాయమైపోయినందుకు బాధపడలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏళ్ల తరబడి తాను ప్రేమించిన వ్యక్తి చేజారిపోతుంటే చూస్తూ ఊరుకోలేదు. మొత్తానికి విక్రమార్కురాలిలా పోరాడి ప్రేమించినోడ్ని కట్టుకుంది.
ప్రేమించినోడు కాదు పొమ్మంటే..!
వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తికి చెందిన శ్వేత.. అదే మండలంలోని సూరారంకు చెందిన సుధీర్ గౌడ్ కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. అయితే పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ముఖం చాటేస్తూ వచ్చాడు. ఇరువురి కుటుంబాలు సైతం పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఇక పెళ్లి కుదుర్చుకునే సమయంలో ప్లేటు ఫిరాయించాడు సుధీర్. శ్వేత ఎంత బతిమాలినా కాదు పొమ్మన్నాడు. చివరకు ఆమె సుధీర్ ఇంటి ఎదుట బైఠాయించింది.
మండల కాలం దీక్ష.. మెట్టు దిగిన ప్రియుడు
ఒక్క రోజు కాదు పది రోజులు కాదు దాదాపు 41 రోజులు అతడి ఇంటి ఎదుట దీక్షకు దిగింది శ్వేత. అయినా సుధీర్ మనసు మారలేదు, కరగలేదు. ప్రేమ పాఠాలు వల్లించి నీకు జీవితాంతం తోడుంటానంటూ చెప్పిన సుధీర్ మాట మార్చడంతో శ్వేత చివరగా ఆత్మహత్యకు ఒడిగట్టింది. దీంతో మెట్టుదిగిన సుధీర్ చివరకు పెళ్లికి అంగీకరించాడు. తన మనసు మార్చుకుని శ్వేత మెడలో మూడు ముళ్లు వేశాడు. బంధుమిత్రుల సమక్షంలో ఆమెను తన భార్యగా స్వీకరించడంతో ఈ కథ సుఖాంతమైంది.
మనసిచ్చినోడితోనే మనువు
మొత్తానికి శ్వేత, సుధీర్ గౌడ్ ప్రేమవివాహం విజయవంతమైనందుకు స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. ఇష్టమైనోడు కాదు పొమ్మన్నా.. పట్టు వీడకుండా 41 రోజులు దీక్ష చేసి సుధీర్ ను భర్తగా పొందడం ఆమె ధైర్యానికి మచ్చుతునకగా అభివర్ణిస్తున్నారు. అవమానాలు, అవాంతరాలు ఎదురైనా కూడా.. మనసిచ్చినోడినే మనువాడిన శ్వేతకు విక్రమార్కురాలిగా గుర్తింపు దక్కినట్లైంది.