తెలంగాణలో కల్లోలం: మాజీ ఉప ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్: హోమ్ క్వారంటైన్
వరంగల్: తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. వెల్లువలా ముంచెత్తుతోంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గంటగంటకూ విస్తరిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులను వదలట్లేదు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆ పరంపర కొనసాగుతోంది. ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి కరోనా వైరస్ పాజిటివ్గా తేలారు.
Recommended Video
కరోనా వ్యాక్సిన్ను ఎవరూ కొనొద్దు: ఆ బాధ్యత ప్రభుత్వాలదే: టీకా రేటుపై క్లారిటీ: సీరమ్ సీఈఓ
మరుసటి రోజే- టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ మహమ్మారి బారిన పడ్డారు. అనారోగ్యానికి గురైన ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించగా.. కరోనా పాజిటివ్గా తేలింది. దీనితో ఆయన హోమ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. కడియం శ్రీహరి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలను నిర్వహించారు. వాటికి సంబంధించిన రిపోర్టులు అందాల్సి ఉంది. కడియం శ్రీహరికి కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే ఆయన గన్మెన్లు, వ్యక్తిగత సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు.
వరంగల్ మేయర్ జీ ప్రకాష్రావు, ఆయన భార్యకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే టీఆర్ఎస్కు చెందిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ఆయన కుటుంబానికీ కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం వారంతా హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. వివేకానంద భార్య సౌజన్య, కుమారుడు విధాత్ కరోనా బారిన పడ్డారు.
ఇదివరకు హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా కరోనా బారిన పడ్డారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు కరోనా బారిన పడ్డారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఏపీలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కరోనా బారిన పడ్డారు. బియ్యపు మధుసూధన్ రెడ్డి భార్యకు కూడా వైరస్ సోకింది. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. తెనాలికే చెందిన మరో మాజీ ఎమ్మెల్యే రావి రవీంద్రనాథ్ కరోనా బారిన పడి మరణించారు.